Vijayashanthi : కిరణ్ కుమార్ రెడ్డి Vs విజయశాంతి.. తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే నేను ఉండలేను..

నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఈవెంట్ నుంచి విజయశాంతి(Vijayashanthi) మధ్యలోనే బయటకు వచ్చేయడంతో బీజేపీలో చర్చగా మారింది.

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 09:30 PM IST

ఇటీవలే ఏపీ(AP), తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లకు కొత్త అధ్యక్షులని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ, తెలంగాణ నుంచి అనేక మంది బీజేపీ నాయకులు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ ఈవెంట్ నుంచి విజయశాంతి(Vijayashanthi) మధ్యలోనే బయటకు వచ్చేయడంతో బీజేపీలో చర్చగా మారింది.

మీడియాలో కూడా విజయశాంతి మధ్యలో బయటకు వచ్చేయడం వైరల్ గా మారింది. పలువురు మీడియా ప్రతినిధులు కూడా విజయశాంతిని ప్రశ్నించారు. అయితే విజయశాంతి దీనిపై ట్విట్టర్లో స్పందించింది. విజయశాంతి చేసిన ట్వీట్ కిరణ్ కుమార్ రెడ్డినే ఉద్దేశించి అన్నట్టు తెలుస్తుంది.

విజయశాంతి తన ట్విట్టర్లో.. బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది సరి కాదు. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను. అయితే నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది అని తెలిపారు.

అయితే ఈ ట్వీట్ కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించే అని తెలుస్తుంది. దీంతో విజయశాంతి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి దీనిపై ఏపీ బీజేపీ నాయకులు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ స్పందిస్తారేమో చూడాలి.

 

Also Read : Goshamahal Constituency : గోషామహల్ సీటు నాదే అంటున్న విక్రమ్ గౌడ్.. మరి రాజాసింగ్ పరిస్థితి ఏంటి?