KCR Leadership: జాతీయ రాజకీయాల్లో KCR నాయకత్వం అవసరం!

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ భాజపా చేస్తున్న ప్రస్తుత దుష్ట రాజకీయాలను తిప్పికొట్టేందుకు దేశంలోని పలువురు సీనియర్ రాజకీయ నేతల సంపూర్ణ మద్దతు కేసీఆర్ కు ఉందన్నారు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 07:43 PM IST

జాతీయ రాజకీయాల్లో KCR క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా ప్రస్థుతం కొనసాగుతున్న బిజెపి దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతుంటుందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా అన్నారు.ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో సుమారు ఐదు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న స్వార్థ రాజకీయ క్రీడ దేశ ప్రజలపై, దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు దృష్టిసారించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ వంటి సీనియర్ జాతీయ నేతలంతా నేటి బిజెపి రాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నారని వాఘేలా అన్నారు.ప్రధాని మోడి అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలనా, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని, ఇటువంటి కీలక సందర్భంలో మౌనం వహించడం ప్రజాస్వామిక వాదులకు, దేశ ప్రగతి కాములకు తగదన్నారు.”దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్పూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో వొక నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నది. దీన్నిట్లనే చూస్తూ వూర్కోలేక, నిలువరించే దిశగా సరియైన వేదిక దొరకక, మాలాంటి సీనయర్లను ముందుండి నడిపించే నాయకత్వం లేక కొంత ఆందోళనతో వున్నం.

ఈ సందర్భంలో చీకట్లో చిరుదీపమై, మీరు కేంద్ర విధానాలను ప్రతిఘటిస్తున్న తీరు మావంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది. అనుకున్నదాన్ని సాధించేదాక పట్టిన పట్టు విడవని నాయకుడుగా మిమ్మల్ని ఇప్పటికే దేశం గుర్తించింది.అసాధ్యమనుకున్న తెలంగాణను ఎన్నో కష్టాలకు నష్టాలకోర్చి శాంతియుత పంథాలో పార్లమెంటరీ రాజకీయ పంథా ద్వారా సాధించడం దేశ చరిత్రలో గొప్పవిషయం.సాధించిన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తూ అనతికాలంలోనే అప్రతిహతంగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్ర దేశంలో ఇంతటి ఘన చరిత్ర మీది మాత్రమే. విభజనానంతరం తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మిమ్మల్ని అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నాకూడా మొక్కవోని పట్టుదలతో ముందుకు పోతున్న మీ తెగువ నిజంగా మహోన్నతమైనది. మిమ్మల్నే కాకుండా దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని భయ భ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణులద్వారా లొంగదీసుకోవాలనే కుట్రలను బిజెపి అమలు చేస్తున్నది. దేశంలో మత సామరస్యానికీ, ప్రాంతీయ సామరస్యానికీ విఘాతం కలిగిస్తున్న లౌకిక వాద, సమాఖ్యవాద వ్యతిరేక కేంద్ర బిజెపి పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాల్సివున్నది.

ఇటువంటి సందర్భంలో ఈ పీడన నుంచి తెలంగాణ తో పాటు సహచర రాష్ట్రాల ప్రజలను విముక్తం చేయాల్సిన అవసరం మీకున్నదని మావంటి సీనియర్లమందరం భావిస్తున్నాం.మీరు మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయడం కాకుండా భారత దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చింది. నీను మీదగ్గరికి రావడానికి ముందే కాంగ్రేస్ సహా పలు పార్టీల్లోని సీనియర్ నాయకులమంతా కలిసి చర్చించుకున్నాం. ప్రస్థుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్న్యాయంగా వుంటుందనుకున్న కాంగ్రేస్ పార్టీ, నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్నది. బిజెపి దుర్మార్గాలను ఎదుర్కునేందుకు కావలసిన రాజకీయ వ్యూహాన్ని ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకుపోవడంలో ఆ పార్టీ విఫలమౌతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని భావసారూప్య విపక్షాలను కలుపుకుపోయేందుకు మీవంటి నాయకత్వ అవసరం ఎంతో వున్నది. మీ నాయకత్వంలో పనిచేయడానికి మీమంతా సంసిద్ధంగా ఉన్నాం. మీమంతా కలిసి నిర్ణయించుకున్న తర్వాతే నీను మీతో సమావేశం కావడానికి హైద్రాబాద్ వచ్చాను.వారంతా కలిసే నన్ను మీవద్దకు పంపారు.మీకు మా అందరి మద్దతు ఉంటుంది.మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాల్సిందిగా కోరుతున్నం.అందుకు మిమ్మల్ని మరోమారు ఆహ్వానిస్తున్నాం.’’ అని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా నడిపిస్తూనే, దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పును తేవడానికి తనవంతు కృషి చేస్తానని KCR హామీ ఇచ్చారు.వాఘేలా వంటి సీనియర్ నాయకులు తనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.తన నాయకత్వాన్ని సమర్థించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.