TSPSC : రేవంత్ రెడ్డికి`సిట్`నోటీసులు,పేప‌ర్ లీక్ `రివ‌ర్స్`పంచ్‌

పేప‌ర్ లీకు నిర్వాకంపై వేసిన సిట్ విచార‌ణ విప‌క్ష నేత‌ల వైపు మ‌ళ్లింది. ఆరోప‌ణ‌లు చేస్తోన్న

  • Written By:
  • Updated On - March 20, 2023 / 02:16 PM IST

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TSPSC) పేప‌ర్ లీకు నిర్వాకంపై వేసిన సిట్ విచార‌ణ విప‌క్ష నేత‌ల వైపు మ‌ళ్లింది. సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల మీద ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తోన్న రేవంత్ రెడ్డికి(Revanth Reddy) సిట్ నోటీసులు ఇచ్చింది. పేప‌ర్ లీకు ఎపిసోడ్ లో చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు ఉన్న ఆధారాల‌ను తెలియ‌చేయాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌తో పాటు గ‌త మూడు రోజులుగా విప‌క్ష నేత‌లు ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్ల‌కు కూడా నోటీసులు జారీ చేయ‌డానికి సిట్ సిద్ధ‌మ‌యింది.

రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు (TSPSC)

ప్ర‌ధాన నిందితులుగా ఉన్న ప్ర‌వీణ్‌, రాజ‌శేఖ‌ర్ రెడ్డితో పాటు అనుమానితుల‌ను కొంద‌ర్ని సిట్ సోమ‌వారం విచారించింది. అనుమానితులుగా భావిస్తూ తొమ్మిది మందిని విచారిస్తూ, వాళ్ల అకౌంట్ల‌లోని లావాదేవీల‌ను ప‌రిశీలించింది. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC)త‌యారు చేసిన పేప‌ర్ల‌ను ఎప్ప‌టి నుంచి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న క‌స్ట‌డీలో పెట్టుకున్నారు? అనే దానిపై కూడా సీరియ‌స్ గా ద‌ర్యాప్తు చేస్తోంది. ఆ లోపుగా కొన్ని మండ‌లాల్లోని వాళ్ల‌కు మార్కులు బాగా వ‌చ్చాయ‌ని రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుప‌తి సూత్రధారిగా పేప‌ర్ లీకు విష‌యంలో ఉన్నార‌ని దుమ్మెత్తి పోశారు. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌న్నింటికీ స‌మాధానాలు ఇవ్వాల‌ని నోటీసులు ఇచ్చింది.

ఆరోప‌ణ‌ల‌న్నింటికీ  ఆధారాల‌ను ఇవ్వాల‌ని నోటీసులు

గ‌త వారం రోజులుగా పేప‌ర్ లీకు(TSPSC) ఎపిసోడ్ మీద ప‌లు ర‌కాలుగా యూ ట్యూబ‌ర్స్ న్యూస్ ఇచ్చారు. కొన్ని ఛాన‌ళ్లు కూడా త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ వార్త‌ల‌ను అందించార‌ని సిట్ భావిస్తోంది. ప్ర‌సారం చేసిన న్యూస్ కు సంబంధించిన ఆధారాల‌ను చూపాల‌ని కోర‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కూడా మంత్రి కేటీఆర్ , హోం మంత్రి మ‌హ్మ‌ద్ ఆలీ బంధువులు, స్నేహితులుగా ఉన్న కొంద‌రి మీద అనుమానాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. మంత్రి ఛాంబ‌ర్లోని కొంద‌రి మీద ఆపోహ‌ల‌ను క్రియేట్ చేశారు. వాటికి తగిన ఆధారాలు అంద‌చేయాల‌ని సిట్ కోర‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : TSPSC:ఉద్యోగాలు హుష్‌! పేప‌ర్ లీక్ తో సరి, మూడోసారికి స్కెచ్!

గ‌త ఏడాది అక్టోబ‌ర్ నుంచి జ‌రిగిన పేప‌ర్లు అన్నీ నిందితుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌స్ట‌డీలో ఉన్నాయ‌ని తాజాగా విప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌. అత‌ని వ‌ద్ద‌కు పాస్ వ‌ర్డ్ ఎలా వ‌చ్చింది? ఎవ‌రు స‌హ‌కారం అందించారు? ఎన్ని పేప‌ర్లు లీక్ (TSPSC)చేశారు? 2017 నుంచి ఈ తతంగం జ‌రుగుతుంద‌ని వ‌స్తోన్న ఆరోప‌ణలు యువ‌త‌ను మ‌రింత క‌ల‌వ‌ర‌ప‌ర‌స్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాల‌ను కాంగ్రెస్ లీడ‌ర్ బక్కా జ‌డ్సన్ సీబీఐ, ఈడీకి అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీఎస్ పీఎస్ ఇటీవ‌ల నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసిన 8 ప‌రీక్ష‌ల‌కు సంబంధించి కేవ‌లం నాలుగు మాత్ర‌మే ర‌ద్దు చేసింది. మిగిలిన పేప‌ర్ల ప‌రిస్థితి ఏమిటి? అనేది చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో ప‌లువురు ఎంపిక కావ‌డం, కొన్ని మండ‌లాల్లో వంద‌లాది మంది ఉద్యోగాలు పొంద‌డం…త‌దిత‌ర అంశాల‌న్నీ తెర మీద‌కు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా ఎవ‌రెవ‌రె ఎలాంటి ఆరోప‌ణ‌లు చేశారు? అనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. వాళ్ల నుంచి ఆధారాలు రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూ నోటీసులు జారీ చేస్తోంద‌ని తెలుస్తోంది.

విప‌క్షాల ఆరోప‌ణ‌లకు నోటీసులు జారీ (TSPSC)

ప్ర‌ధాన పార్టీలు పోటీపడి యువ‌త‌కు అండ‌గా ఉండేందుకు ముందుకు వ‌స్తున్నారు. గ‌త నాలుగు రోజులుగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీల చీఫ్ లు రంగంలోకి దిగారు. వాళ్లు దీక్ష‌ల‌కు దిగుతూ నిరుద్యోగుల‌ను ఉద్య‌మం వైపు తీసుకెళుతున్నారు. ఆ క్ర‌మంలో యువ‌త‌కు అండ‌గా నిలుస్తోన్న కొన్ని ఛాన‌ళ్లు, యూ ట్యూబ‌ర్స్ ను ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు భ‌య‌పెడుతున్నారు. వాస్త‌వంగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన ప్ర‌కారం ల‌క్ష ఉద్యోగాలు తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. వాటిని భ‌ర్తీ చేసే క్ర‌మంలో ఇటీవ‌ల ఇచ్చిన (TSPSC)నోటిఫికేష‌న్ల ద్వారా కేవ‌లం 8 నుంచి 10వేల ఉద్యోగాలు మాత్ర‌మే భ‌ర్తీ అవుతాయి. మిగిలిన 85వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. అందుకే, ఈ పేప‌ర్ లీకు గంద‌ర‌గోళాన్ని విప‌క్షాల మీద నెడుతూ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తుంద‌ట‌.

బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ల‌కు కూడా నోటీసులు?

ప్ర‌ధాన నిందితుల్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి బీజేపీ కార్య‌క‌ర్త అంటూ బీఆర్ఎస్ చెబుతోంది. కానీ, మంత్రి కేటీఆర్ పీఏ ద్వారా పేప‌ర్ లీకు త‌తంగం అంతా న‌డిచింద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, నిందితుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సన్నిహితుడు అంటూ కొన్ని ఫోటోల‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. ఇలా ప్ర‌ధాన పార్టీలు ప‌ర‌స్ప‌రం పేప‌ర్ లీకు అంశాన్ని చిలువ‌లు ప‌లువ‌లు చేసింది. అందుకే, వాళ్ల నుంచి ఆధారాల‌ను కోరుతూ సిట్ నోటీసులు ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy)నోటీసులు జారీ చేసిన సిట్ ఇక బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ల‌కు కూడా నోటీసులు ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. మొత్తం మీద ఆరోప‌ణ‌ల‌కు బ్రేక్ వేసేలా సిట్ రివ‌ర్స్ ద‌ర్యాప్తులో బిజీగా మారింది.

Also Read: TSPSC: టీఎస్పీఎస్సి పేపర్ లీక్ లో నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న సిట్?