Transfer of IAS : తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. పరిపాలనను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ఏకకాలంలో 45 మంది ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సీనియర్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు, పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడం విశేషం. ముఖ్యంగా రాష్ట్ర సచివాలయంలోని కీలక శాఖల్లో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది.
కీలక నియామకాల విషయానికొస్తే.. సీనియర్ అధికారి సంజయ్ కుమార్ను పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను గౌరవ్ ఉప్పల్కు (ఫైనాన్స్ సెక్రటరీ) అప్పగించగా, రాష్ట్ర అభివృద్ధికి కీలమైన ఐటీ మరియు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా N. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ నియామకాల ద్వారా పాలనలో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలని, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాల స్థాయిలో కూడా భారీ మార్పులు జరిగాయి. జనగామ కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, యాదాద్రికి అనురాగ్ జయంతి, గద్వాలకు రిజ్వాన్ బాషా, కరీంనగర్కు చిత్రా మిశ్రా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా అంకిత్లను నియమించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా చూడటంలో కలెక్టర్ల పాత్ర కీలకం కాబట్టి, సమర్థులైన యువ అధికారులకు ఈ జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బదిలీల పర్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
