సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్బండ్, లుంబినీ పార్క్ పరిసరాల్లో ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనాలను మళ్లిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు.
సిటీలో ట్రాఫిక్ ఆంక్షలున్న ప్రాంతాలు ఇవే
ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్ వద్ద మళ్లిస్తారు.
బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్ ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు.
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు.
ఎక్బాల్మినార్ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు.
పంజాగుట్ట, రాజ్భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు.
నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు.
హిమాయత్నగర్, బషీర్బాగ్, అంబేద్కర్ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్బండ్పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై నుంచి వెళ్లాలి.
సికింద్రాబాద్ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్బండ్ పైకి అనుమతించరు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు.
ముషీరాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్రోడ్డు వద్ద మళ్లిస్తారు.