టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో…గాంధీభవన్ లో ముఖ్యనేతలంతా సమావేశం అయ్యారు. మునుగోడు టికెట్ ఆశించిన ఆశావాహులను రేవంత్ రెడ్డి బుజ్జగించారు.
కేసీఆర్ ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు…జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి సంబంధించి పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ తోపాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు.