Revanth Reddy : కేసీఆర్ నిధులివ్వ‌కే స‌ర్పంచ్‌ల ఆత్మ‌హ‌త్య‌లు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ అధిష్టానం సర్పంచ్‌ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని

  • Written By:
  • Publish Date - January 10, 2023 / 08:44 AM IST

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ అధిష్టానం సర్పంచ్‌ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం . గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో 60 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు అధికారం దక్కకుండా చేస్తేనే సర్పంచ్‌లకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ పంచాయత్‌ రాజ్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో సర్పంచ్‌కి ప్రథమ పౌరుడిగా గౌరవం ఉందని, అలాంటి స‌ర్సంచ్‌లకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంతో తెలంగాణలో 60 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలకు చెందిన రూ.35 వేల కోట్లను దారి మళ్లించిందని ఆరోపించారు.

సర్పంచ్‌ల ఖాతాల్లో జమ చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కొందరు స‌ర్పంచ్‌లు వడ్డీలకు డబ్బులు తెచ్చి తమ గ్రామాల అభివృద్ధికి వెచ్చించారని అన్నారు. సర్పంచ్‌లకు రెండు, మూడేళ్లు గడిచినా నిధులు రాకపోవడంతో కొందరు తమ జీవితాలను అంతమొందించుకోగా, మరికొందరు తమ భార్యలకు మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. సర్పంచ్‌లకు సంఘీభావంగా పార్టీ చేపట్టిన ధర్నాను అనుమతించవద్దని తెలంగాణ సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేసి పార్టీని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. హైకోర్టు అనుమతితో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, త‌మ‌ ధర్నాకు పలువురు సర్పంచ్‌లు మద్దతు తెలిపారని రేవంత్ అన్నారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటి వరకు చనిపోయిన ప్రతి సర్పంచ్ కుటుంబానికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.