Revanth Reddy : రైతు వేదిక‌లు రాజ‌కీయ వేదిక‌లు కానివ్వొద్దు.. రైతుల‌కు రేవంత్ పిలుపు

రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాల‌ని రైతుల‌కు రైవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న

  • Written By:
  • Updated On - July 16, 2023 / 06:56 PM IST

రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాల‌ని రైతుల‌కు రైవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైతుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరిందని.. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంచింద‌ని ఆయ‌న లేఖ‌లో ఆరోపించారు. రైతు వేదిక‌ల‌ను ఇప్పుడు రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించిందని.. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. అయితే చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందని.. ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందని తెలిపారు. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు మంది ఉన్నార‌ని.. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని తెలిపారు.

ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని.. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుందని రేవంత్ రెడ్డి లేఖ‌లో ఆరోపించారు. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదని.. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలిందని.. కానీ కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుందన్నారు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం మోసం చేసింద‌ని.. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇందుకు సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే సాక్ష్యమ‌న్నారు.