Toll Charges Hike : దేశవ్యాప్తంగా జూన్ 2 నుంచి టోల్ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే ఈ ఛార్జీలు పెరగాలి. కానీ ఎన్నికల కోడ్ కారణంగా టోల్ఛార్జీల పెంపును వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరిదైన ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజా ఛార్జీలు పెరుగుతాయి. దీనిపై ఇప్పటికే NHAI నుంచి టోల్ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు అందాయి. టోల్ ప్లాజా ఛార్జీల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. ఏటా జాతీయ రహదారుల నిర్వహణ అవసరాల కోసం టోల్ ప్లాజా ఛార్జీలను పెంచుతుంటారు.
We’re now on WhatsApp. Click to Join
హైదరాబాద్-విజయవాడ (65) నేషనల్ హైవే లెక్కల్లోకి వెళితే.. దీనిపై తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. ఈ ప్లాజాల నుంచి ఒకవైపు కార్లు, వ్యాన్లలో ప్రయాణానికి రూ.5, రానుపోనూ కలిపి రూ.10 వసూలు చేస్తారు. తేలికపాటి గూడ్స్ వెహికల్స్కు ఒక వైపు రూ.10, ఇరు వైపులా రాకపోకలకు రూ.20 వసూలు చేస్తారు. బస్సులకు, ట్రక్కులకు రూ.25, రూ.35 చొప్పున గతంలో ఛార్జీలు ఉండేవి. అయితే వాటికి టోల్ ప్లాజా ఛార్జీలను రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలలో 25 శాతం మేర మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ను కూడా పెంచారు. ఆ పాసుల రేటును రూ.330 నుంచి 340కి పెంచారు. ఈసారి జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు(Toll Charges Hike).. 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. అయితే 2 నెలల నష్టాన్ని ఎన్హెచ్ఏఐ కవర్ చేసుకోవాలని అనుకుంటుందో లేదో చూడాలి.