ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్స్ కు ఉదయం పూట టిఫిన్ (Tiffin In Govt Schools) అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మళ్ళీ స్కూళ్ళు తెరుచుకోగానే .. స్టూడెంట్స్ కు టిఫిన్ పెట్టే కార్యక్రమం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ ను స్టూడెంట్స్ కు అందిస్తామని తెలిపింది.
ALSO READ : Tiffins & Meals Cost: హైదరాబాద్ లో భోజనం రూ.150.. టిఫిన్ రూ.50 పైనే!.. ఎక్కడ తక్కువంటే…!
విద్యార్ధులు ఖాళీ కడుపుతో వస్తున్నారని..
గవర్నమెంట్ స్కూళ్లకు చాలామంది విద్యార్ధులు ఖాళీ కడుపుతో వస్తున్నారని.. ఈ క్రమంలోనే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టిఫిన్ (Tiffin In Govt Schools) అందించాలని రాష్ట్ర సర్కారు డిసైడ్ చేసింది. దీనితోపాటు మధ్యాహ్న భోజన పథకం మెనూలోనూ మార్పులు చేస్తామని ప్రకటించింది. వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీతో పాటు హైస్కూల్ విద్యార్ధులకు తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందిస్తామని పేర్కొంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయడం కోసం బెల్లం పౌడర్, రాగి పిండిని పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కుక్ కమ్ హెల్పర్లు రాగి జావాను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్ల సహకారంతో విద్యార్థులకు రాగిజావాను అందజేస్తున్నారు.