Group 1 Notification : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈమేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి దశలో (2022 ఏప్రిల్లో) 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన 503 గ్రూప్-1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను కలుపుతామని అనౌన్స్ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి పెరిగింది. మొత్తం 563 పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ (Group 1 Notification) ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అయింది. ఈక్రమంలోనే పాత నోటిఫికేషన్ను రద్దు చేసింది.
We’re now on WhatsApp. Click to Join
పాత గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించిన పలు సమస్యలపై టీఎస్పీఎస్సీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాకే అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా గత నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి.. నిబంధనలు సరిగా పాటించలేదని మరోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. అనంతరం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవల అదనంగా మరో 60 గ్రూప్ -1 పోస్టులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.