జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

GHMC  జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టేవారి భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను కట్టకుండా ఉన్నవారి జాబితాను రెడీ చేశారు. పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్ చేరుకోలేకపోవడంతో.. వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్‌లు చెల్లించకుండా ఉన్నవారిని గుర్తించి.. వారి ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించుకున్న అధికారులు.. వారి లిస్ట్‌ను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) […]

Published By: HashtagU Telugu Desk
Ghmc

Ghmc

GHMC  జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టేవారి భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను కట్టకుండా ఉన్నవారి జాబితాను రెడీ చేశారు. పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్ చేరుకోలేకపోవడంతో.. వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్‌లు చెల్లించకుండా ఉన్నవారిని గుర్తించి.. వారి ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించుకున్న అధికారులు.. వారి లిస్ట్‌ను సిద్ధం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇటీవలె మూడు కార్పొరేషన్లుగా విడిపోయిన సంగతి తెలిసింది. జీహెచ్ఎంసీతోపాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎన్‌సీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎన్‌సీ)గా ఏర్పాటు చేశారు. అయితే ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నగరవాసులకు అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. జీహెచ్ఎంసీ విభజన నేపథ్యంలో 3 కార్పొరేషన్లపై రుణ భారం పడకుండా రూ.4780 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేయనుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు గత కొన్నేళ్లుగా భారీగా పేరుకుపోతుండటంతో.. ఖజానాకు ఆశించిన మేర వసూళ్లు రావడం లేదు.

పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు అధికారులు ఏటా టార్గెట్ పెట్టుకుని మరీ వసూళ్లు చేస్తున్నా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీంతో రూ.వందల కోట్ల బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. జీహెచ్ఎంసీకి డబ్బు తీసుకొచ్చే ప్రధాన ఆర్థిక వనరు అయిన ఆస్తి పన్ను రాకపోవడంతో.. అది అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 2025-2026 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. వీలైనన్ని ఎక్కువ బకాయిలను వసూలు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా భారీగా బకాయిలు పేరుకుపోయిన వారి జాబితాను రెడీ చేసి.. వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.

సాధారణంగా వసూలు చేస్తున్న ఈ ఆస్తి పన్ను బకాయిల వసూళ్లతో ఈ ఆర్థిక ఏడాదిలో 3 కార్పొరేషన్లపై కలిపి ఇప్పటివరకు మొత్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వసూలు అయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్లు వసూలు చేయాలని అధికారులు పెట్టుకున్న లక్ష్యానికి ఇంకో రూ. 1000 కోట్లు మిగిలి ఉండగా.. ఆ మొత్తాన్ని మార్చి 31వ తేదీ లోపు వసూలు చేయాలని అధికారులు వ్యూహాలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను ఎగవేస్తూ.. రూ.కోట్లల్లో పేరుకుపోయిన బడా వ్యాపారులు, బడా సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం అయ్యారు.

ఎన్నో ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్న కార్పొరేట్ సంస్థలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్‌మెన్‌ల లిస్ట్ రెడీ చేశారు. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో ఆస్తి పన్ను అధికంగా ఉన్న ఆస్తులను సీజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ వంటి నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కమర్షియల్ ప్రాపర్టీల ఓనర్లే ఈ ఎగవేతదారుల లిస్ట్‌లో టాప్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా కేవలం కమర్షియల్ ఆస్తుల నుంచే జీహెచ్ఎంసీకి దాదాపు రూ.1000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.

ఇక ఆస్తులు సీజ్ చేసే ముందు చివరి హెచ్చరికలో భాగంగా ఆస్తి పన్ను ఎగవేతదారులకు ప్రత్యేకంగా రెడ్ నోటీసులు జారీ చేసేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయింది. ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ పన్ను చెల్లించకపోతే.. జీహెచ్ఎంసీ యాక్ట్‌లోని సెక్షన్ 269 కింద వారిపై డిస్ట్రెస్ వారెంట్లు జారీ చేసి.. వారి ఆస్తులను, షాపులను సీజ్ చేయడంతో పాటు.. వాహనాలను కూడా జప్తు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు.

మరోవైపు.. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు చెల్లిస్తే.. వాటిని ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకం కింద చెల్లిస్తే.. వడ్డీలో సుమారు 90 శాతం మినహాయింపు కల్పించనున్నారు. ఈ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అధికారులు దాన్ని మరింత ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలు చేసుకోని వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ముందుగా పన్ను చెల్లించే వారికి ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా 5 శాతం రాయితీని ఇవ్వనున్నారు. అదే సమయంలో మొండి బకాయిల వసూళ్ల కోసం ఆస్తులు జప్తు చేసుకునే ప్రక్రియను కూడా కొనసాగిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

 

  Last Updated: 06 Mar 2026, 03:45 PM IST