TCongress: హైదరాబాద్ లో హస్తం పార్టీ హవా, బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలమేనా!

  • Written By:
  • Updated On - February 13, 2024 / 12:23 AM IST

TCongress: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ను పక్కనపెట్టి బీఆర్ఎస్ ను గెలిపించారు. గ్రేటర్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు గెలిపించాలని అప్పట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సత్తా చూపిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే గ్రేటర్ పరిధిలో కారు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి దూకుడు ఇప్పుడు సన్నగిల్లే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొద్ది రోజుల తేడాతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసేందుకే తాము ముఖ్యమంత్రిని కలిశామని వారు ప్రకటించారు. కానీ అంతకుముందు మెదక్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తోంది.

అయితే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహా గానాలు వినిపించాయి. ఆ ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. కొద్దిరోజుల తర్వాత గ్రేటర్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్లు గైరాజులయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే తాము గైర్హాజరయ్యామని వారు చెప్పినప్పటికీ అసలు వాస్తవం అది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి గైర్హాజరు తో భారత రాష్ట్ర సమితిలో కలకలం చెలరేగింది.

రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇప్పటివరకు కొనసాగిన భారత రాష్ట్ర సమితి చైర్మన్లు మాజీలు అయిపోతున్నారు. దాదాపు 20 మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇచ్చి చైర్మన్లను దింపేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 20 మున్సిపాలిటీలు చేరాయి. ఇన్ని మున్సిపాలిటీలు తన ఖాతాలో పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఎందుకు వద్దనుకుంటుంది? ఈ క్రమంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ రెడ్డిని కలిశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు గతంలో డిప్యూటీ మేయర్ గా పని చేసిన బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పనిచేశారు. భారత రాష్ట్ర సమితి అంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.