Text Books : స్కూళ్లకు సంబంధించిన పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ‘ముందుమాట’ ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీకి అనుగుణంగా ‘ముందుమాట’ను మార్చాలి. కానీ మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫొటోలు, పేర్లతో ఉన్న ముందుమాటనే పాఠ్య పుస్తకాల్లో కంటిన్యూ చేశారు. వాటితో ఉన్న టెక్ట్స్ బుక్స్నే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున పాత వివరాల స్థానంలో నూతన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నూతన విద్యాశాఖ మంత్రి పేర్లు, ఫొటోల వివరాలను చేర్చి.. పుస్తకాలను మళ్లీ ముద్రించాలనే విషయాన్ని సంబంధిత అధికారులు మర్చిపోయారు. దీంతో ఈ తప్పిదం చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
ఈవిషయం ఆలస్యంగా సీఎం రేవంత్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఇప్పటివరకు పాఠశాలలకు పంపిణీ చేసిన టెక్ట్స్ బుక్స్ను(Text Books) వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ చేసిన పుస్తకాలను స్కూళ్లలో టీచర్లు వెనక్కి తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12నే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఆయా జిల్లాల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్లను పంపిణీ చేశారు.
ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తుంటుంది. ఈ పుస్తకాలను ముందస్తుగా పార్టు-1, పార్టు-2గా విభజించి పంపిణీ చేస్తారు. తొలుత పార్టు-1 కింద పాఠ్య పుస్తకాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని గోదాంలకు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి మండలాలకు సరఫరా అవుతాయి. అనంతరం పార్టు-2 కింద వర్కుబుక్స్, వర్కు షీట్స్, స్టూడెంట్ వర్కు షీట్స్, లక్ష్య పుస్తకాలను ఆగస్టు నాటికి పంపిణీ చేస్తారు.