కాళేశ్వరం ప్రాజెక్టును చూపించడానికి ఒకప్పుడు బస్సులు పెట్టారు. తెలంగాణ ప్రజల్ని ఆ ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఒకసారైనా కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయాలనే రీతిలో ప్రచారం చేసింది. సీన్ కట్ చేస్తే, కాళేశ్వరం వెళ్లడానికి ఏ ఒక్కరికి ప్రస్తుతం అనుమతి లేదు. ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ప్రైవేటు సైన్యం నీడన ఉంది. వరదల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి విపక్ష నేతలు వెళ్లడానికి అనుమతి లేదు. అక్కడికి వెళ్లిన వాళ్లను ప్రైవేటు సైన్యం వెనక్కు పంపిస్తోంది. ఆ సైన్యానికి తెలంగాణ పోలీసులు అండగా ఉంటున్నారు. ఫోటోలు తీయడానికి కూడా నిషేధాజ్ఞలు ఉండడం గమనార్హం.
ప్రతి అంశానికి ముందుండే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు వైపు ఇప్పటి వరకు చూడలేదు. కొందరు కాంగ్రెస్ లీడర్లు నామమాత్రంగా అక్కడికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఏఐసీసీ మెంబర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల, తీర్మాన్ మల్లన్న మినహా కనీసం ప్రాజెక్టు వద్దకు చేరుకోవడానికి ప్రయత్నం చేసిన రాజకీయ పార్టీల నేతలు దాదాపుగా ఎవరూ లేరని చెప్పొచ్చు. ఉద్యమాలకు ముందుండే కామ్రేడ్లు మౌనంగా ఉన్నారు. కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. ప్రధాన మీడియా వాస్తవంగా కాళేశ్వరంలో ఏమి జరిగిందో తెలియచేస్తూ న్యూస్ ఇవ్వడానికి జంకుతోంది. ఇలాంటి పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలోనూ ఉండదేమో.
ఏఐసీసీ మెంబర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బంకా జడ్సన్ కాళేశ్వరంలోని అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం గురించి దర్యాప్తు సంస్థలకు ఆధారాలను అందించారు. అంతేకాదు, సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీని మేఘా సంస్థ ఎగవేసిందని తెలియచేస్తూ ఈడీ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం వరద నీళ్లలో ఉన్న మోటార్లు రిపేర్ కు రూ. 10వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని మేఘా సంస్థ భరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మేఘా సంస్థకు మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నిర్వహణ బాధ్యతను మేఘా సంస్థ తీసుకోవాలని చెబుతున్నారు. కానీ, ప్రభుత్వ నిధుల నుంచి నిర్వహణ వ్యయాన్ని కూడా తీసుకోవడానికి మేఘా సంస్థ ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టులోని లోపాలు, నిధుల దుర్వినియోగం తదితరాల గురించి ఈడీ, సీబీఐ, కాగ్ తదితర సంస్థలకు ఫిర్యాదులను జడ్సన్ అందించారు. కానీ, ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు ప్రాథమిక విచారణకు పూనుకోలేదు.
Also Read: AP Employees: ఏపీ ఉద్యోగులకు `జగన్ మార్క్` క్రమశిక్షణ
వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్ఐఎస్) వద్దకు వెళ్లిందట. ట్రాఫిక్ స్తంభించిన కారణంగా వాళ్లను పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఆ పార్టీ పోరాటం నిలిచిపోయింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్బాబు, సీతక్క, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి తో పాటు కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి తదితరులు ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ప్రయత్నం చేశారని కాంగ్రెస్ చెబుతోంది. కాళేశ్వరం పరిసర ప్రాంతాలు మావోయిస్టుల ఆధీనంలో ఉన్నాయని పోలీసులు చెప్పిన మాటలను కాంగ్రెస్ లీడర్లు నమ్మారు. అందుకే, వెనుతిరిగామని చెప్పడం గమనార్హం.
మంగళవారం దుమ్మగూడెం ప్రాజెక్టు సందర్శనకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) బూర్గంపహాడ్ మండలం మణుగూరు క్రాస్ రోడ్స్పై రాస్తారోకో (రోడ్బ్లాక్) ధర్నాకు దిగింది.అంతకుముందు భద్రాచలం, పినపాక డివిజన్లలోని వరద ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల బృందం పర్యటించింది. సీఎల్పీ బృందం వరద బాధితులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నెల రోజుల క్రితం వరదల్లో మునిగిపోయిన కాళేశ్వరం వద్దకు వెళ్లడానికి విపక్ష లీడర్లు సాహసం చేయలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచిత్రమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. మీడియా ముందుకొచ్చి ఆ ప్రాజెక్టు నష్టాన్ని ప్రజలకు తెలియచేసే ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేయకపోవడం విమర్శలను ఎదుర్కొంటోంది.
కాళేశ్వరం గురించి జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేయడానికి కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ మాత్రం సిద్ధం అవుతున్నారు. ఆ విషయాన్ని మీడియాకు చెప్పారు. కానీ, ఆయనకు సహకారం అందించడానికి కాంగ్రెస్ బడా లీడర్లు ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం. సాధారణంగా కాళేశ్వరంలాంటి ప్రాజెక్టుల్లో భారీ నష్టం వాటిల్లినప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒక వేళ ప్రభుత్వం అందుకే సిద్ధంగా లేని పక్షంలో నిజనిర్థారణ కమిటీని నిపుణులతో వేసి విపక్షాలు ఐక్యంగా కదలాలి. కానీ, ఎవరికీ పట్టని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వరద ముంపు నష్టం ఉండడం తెలంగాణ ప్రజలకే ఎరుక.
Also Read: Balakrishna: బాలయ్య సతీసమేతంగా.. `ఎన్టీఆర్ ఆరోగ్య రథం`