చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ నేతలు స్పందిస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా స్పందించనప్పటికి సన్నిహితుల వద్ద చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటున్నారు.కొంతమంది నేతలు మాత్రం చంద్రబాబు అరెస్ట్ను బహిరంగంగానే ఖండిస్తున్నారు. నిన్న వనస్థలిపురంలో చంద్రబాబు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంలో జరిగిన ర్యాలీలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. అంతకముందు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా చంద్రబాబు అరెస్ట్పై మాట్లాడారు. మోడీకి సపోర్ట్ చేస్తే కేసులు ఉండవని.. చంద్రబాబు బీజేపీకి సపోర్ట్ చేయనందునే ఆయన్ని ఈ కేసుల్లో ఇరికిస్తున్నారని తెలిపారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ను మంత్రి మల్లారెడ్డి ఖండించారు. చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాజకీయ కక్షతోనే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించారని తెలిపారు.జగన్, మోడీ కుట్రలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని మల్లారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు మద్దతుగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్ధతు ఉంటుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.