Buddhist heritage park: కృష్ణా తీరంలో బుద్ధ వనం.. మే 14న ప్రారంభోత్సవం.. ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం విశేషాలివీ

బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టే శిల్పాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం..

  • Written By:
  • Publish Date - May 13, 2022 / 03:42 PM IST

బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టే శిల్పాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం..
శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ..
లుంబిని, సారనాథ్‌, బుద్ధగయ, కృషి నగర్‌ బౌద్ధ క్షేత్రాలను మరిపించేలా బుద్ధవనం.. ఇవన్నీ తెలంగాణ లోని నాగార్జున సాగర్‌లో ఉన్న హిల్‌ కాలనీలో 274 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బుద్ధవనం’ ప్రాజెక్ట్‌ విశేషాలు. గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో ఈ బుద్ధవనాన్ని ఆవిష్కరించారు. దీన్ని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మే 14న (శనివారం) ప్రారంభించనున్నారు. అంతర్జాతీయంగా బౌద్ధ పర్యాటకులకు ఆకర్షించాలనే లక్ష్యం తో దీన్ని అభివృద్ధి చేశారు.
బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా ఈ బుద్ధవనంలో 8 పార్కులు ఏర్పాటు చేశారు. నలువైపులా పచ్చదనంతో ఈ ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది.

8 పార్కుల్లో ఏముంది?

బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలను మొదటి పార్కులో
ఏర్పాటు చేశారు. రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు నిర్మించారు. ఇక మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు. నాలుగోది ప్రపంచ స్థూపాల పార్క్ . శ్రీలంక వాసుల సహకారంతో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను ఐదో పార్కులో ఏర్పాటు చేశారు. ఆరో పార్కును ధ్యాన వనంగా తీర్చిదిద్దారు. ఏడో పార్కులో మహా స్థూపం నిర్మించారు. ఎనిమిదో పార్కును స్థూప వనంగా తీర్చిదిద్దారు.

మహా స్థూపంలో ఏమున్నాయంటే..

మహా స్థూపాన్ని 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. కాంక్రీట్‌తో నిర్మించిన స్థూపాల్లో ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారు. స్థూపం కింది భాగంలో లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం ఉన్నాయి.విశాలమైన ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజుల పాటు కఠోర తపస్సు చేశాడు. హృదేలా గ్రామంలో సుజాతా దేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ ఇతివృత్తాంతాన్ని ప్రతిబింబిచేలా మహా స్థూపం కింది భాగంలో మోకాళ్ల మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు.

2005లో శంకుస్థాపన..

బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి
2005లో నాటి పర్యాటక శాఖ అధికారులు శంకుస్థాపన చేశారు. బౌద్ధ మత గురువు దలైలామా 2006లో అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేంత వరకూ బుద్ధవనం నిర్మాణ పనులకు కేంద్రమే నిధులు ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. 2015 మే మొదటి వారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాగార్జున సాగర్‌లో ప్లీనరీ నిర్వహించింది. ఈ సమావేశం నిమిత్తం సాగర్‌కు వచ్చిన సీఎం కె చంద్రశేఖర్ రావు బుద్ధవనాన్ని సందర్శించారు. దాని అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించారు. మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. నాటి నుంచి పనులు కొనసాగి ప్రాజెక్టు పూర్తయింది.