టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఖండిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ దోషులు కాదన్నారు. చంద్రబాబు అవినీతిపరుడో, కాదో కోర్టులు నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి అరెస్టులు, కక్ష పూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై బీఆర్ఎస్ నేతలు ఇప్పడిప్పుడే స్పందిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా రెండు రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా పనిచేశాను.. చంద్రబాబు అక్రమ అరెస్టు తనకు వ్యక్తిగతంగా బాధ కలిగించిందన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. చంద్రబాబు ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. 73 ఏళ్ల చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని తలసాని తెలిపారు. అయితే బీఆర్ఎస్ నేతలు స్పందనపై తెలంగాణ టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన 20 రోజుల తరువాత ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం బాబు జపం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read: Pawan Kalyan : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా..? – పవన్ కళ్యాణ్