Congress MLA Offered Reward: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టును నరికి చంపిన వారికి తన భూమిని బహుమతిగా ఇస్తానని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రాహుల్ గాంధీని నంబర్ వన్ టెర్రరిస్టు అంటూ రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రవ్నీత్ సింగ్ బిట్టుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన తల నరికిన వారికి తన 1.38 ఎకరాల భూమిని బహుమతిగా ఇస్తానని అన్నాడు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (Vedma Bojju) మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తల నరికిన వారికి తన ఎకరం 38 గుంటల భూమిని ఇస్తానని చెప్పాడు.“రవనీత్ సింగ్ బిట్టు తన మాటలను వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ఖానాపూర్ ఎమ్మెల్యేగా నా ఆస్తిని, మా నాన్నగారి ఆస్తులను తన తల నరికిన వారికి బదలాయిస్తానని ప్రకటిస్తున్నాను” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై అధికార పార్టీ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు మీడియాతో అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. రవనీత్ బిట్టు (Ravneet Singh Bittu) తల నరికిన వారికి 1.38 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం విడ్డురమన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా నిరసనకు దిగింది .కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ దిష్టిబొమ్మను బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. నాగేందర్కు ప్రజా జీవితంలో ఉండే హక్కు లేదని బీజేపీ పేర్కొంది. గత బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో కంగనా రనౌత్పై నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కంగనా రనౌత్పై నాగేందర్ చేసిన వ్యాఖ్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేతల మౌనాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నాగేందర్ ఉపయోగించిన ‘నీచమైన భాష’ ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి మహిళల పట్ల అగౌరవాన్ని ప్రదర్శించకూడదని సూచించారు.
Also Read: Laddu Controversy : శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు..చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ..!