Caste Census : వచ్చే జన గణనతో పాటే కుల గణన కూడా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మోడీ సర్కారును ఆయన అభినందించారు. ఇందుకుగానూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర క్యాబినెట్కు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతోందని చెప్పారు.‘‘రాహుల్ విపక్షంలో ఉండి కూడా కేంద్ర సర్కారు విధానాన్ని ప్రభావితం చేశారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే. రాహుల్ విజన్తో రాష్ట్రంలో కులగణన చేపట్టాం. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనూ ఆందోళన చేశారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది అని మరోసారి రుజువైంది’’ అని పేర్కొంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
Based on the vision and direction of
Shri @RahulGandhi Ji who first demanded a nation-wide Caste Census during his historic #BharatJodoYatra Telangana is the first State to conduct caste survey last year.This was the first in Independent #India, the last one being in 1931 by… pic.twitter.com/7dNABdwqM7
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025
తొలిసారి డిమాండ్ చేసిన నాయకుడు రాహుల్ గాంధీ
‘‘దేశవ్యాప్తంగా కులగణన(Caste Census) నిర్వహించాలని తొలిసారి డిమాండ్ చేసిన నాయకుడు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర వేళ ఈ అంశంపై రాహుల్ బలంగా గళమెత్తారు. తొలిసారిగా గత ఏడాది కులగణనను తెలంగాణ రాష్ట్రం నిర్వహించింది. స్వతంత్ర భారతదేశంలో కులగణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే. చివరిసారిగా బ్రిటీష్ పాలనా కాలంలో 1931లో కులగణన జరిగింది. తెలంగాణలో సమగ్ర సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను చేయించాం. రాష్ట్రంలోని 56.32 శాతం జనాభా బీసీలే అని గుర్తించాం. కులగణన నివేదికను తెలంగాణ అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనతో కూడిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది’’ అని సీఎం రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Also Read :Caste Census : కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. కారణం అదే ?
ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం: మహేశ్ కుమార్ గౌడ్
కుల గణన నిర్వహిస్తామని కేంద్ర సర్కారు చేసిన ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వెలిబుచ్చారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామనడం చాలా మంచిపరిణామమని తెలిపారు. రాహుల్ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేశామని టీపీసీసీ చీఫ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కులగణనకు మోడీ సర్కారు ఒప్పుకుందన్నారు.