గుజరాత్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోవు రోజుల్లో ఈ ఫలితాలు నరేంద్ర మోడీ మీద ప్రభావం చూపుతాయా? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తిరుగులేని లీడర్ గా ఎదగాలంటే గుజరాత్ ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉండాలా? ఇలాంటి అంశాలపై దేశ వ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి గుజరాత్ ఫలితాలపై ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
గుజరాత్ మోడల్ ను చూపి 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా మొదలైయింది. అప్పటి నుంచి తిరుగులేని లీడర్ గా ఆయన కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ పతనాన్ని చూడాలని కేసీఆర్ తో సహా విపక్షాలు చేస్తోన్న ప్రయత్నం. అక్కడి తాజా సర్వేలను పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండగా ఆప్ గెలుపోటములను నిర్దేశిస్తుందని తెలుస్తోంది. ప్రముఖ ఆత్మసాక్షి సర్వే సంస్థ ఈనెల 21వ తేదీ వరకు చేసిన సర్వే ప్రకారం స్వల్ప తేడాతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.
Also Read: Revanth Reddy : రైతు సమస్యలపై పోరుకు సిద్ధమైన రేవంత్
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ మొత్తం స్థానాల సంఖ్య 182. అంటే, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. తాజా సర్వే ప్రకారం BJP =42 శాతం, INC =38 శాతం, AAP=16 నుండి 17 శాతం, ఇతరులకు 3 నుండి 4 శాతం ఓటు బ్యాంకు ఉంది. సీట్ల రూపంలో BJP 101 నుండి 106, INC =65 నుండి 68, AAP=9 నుండి 10, OTHERS 2 నుండి 3 ఎమ్మెల్యేలను గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. ఆ రాష్ట్రాంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక, మౌలిక వసతులు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలను బేరీజు వేస్తూ ఈసర్వే చేయడం జరిగింది.
ప్రభుత్వంపై వ్యతిరేకత, రెబల్ అభ్యర్థులు, నిరుద్యోగ సమస్య ,ఉద్యోగుల అసహనం, మూతపడిన పాఠశాలల సంఖ్య ,డీజిల్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసరాల ధరలు, లిక్కర్ మాఫియా, అత్యధిక విద్యుత్ ఛార్జీలు, పారిశ్రామిక కాలుష్యం, నిరుద్యోగం తదితరాలు ఈసారి బీజేపీని వెంటాడుతున్నాయి. ప్రధానంగా యువ ఓటర్లను ఆప్ పెద్ద సంఖ్యలో చీల్చుకోనుంది. అలాగే సామాజికవర్గాల పరంగా బీజేపీకి సానుకూలంగా ఉండే పటేల్ కమ్యూనిటీ ఓటింగ్ BJP , కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతోంది. SC,ST మద్దతు INCకి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో INC ముందంజలో ఉండగా, సౌరత్రా, గుజరాత్ ఉత్తర ప్రాంతాలలో BJP వెనుకబడి ఉందని సర్వే తేల్చింది. AAP ఎక్కువగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును గ్రామీణ ప్రాంతాల్లో చీల్చుకోనుంది. పట్టణ ప్రాంతాల్లో BJP ఓటు బ్యాంకును స్వల్పంగా కొల్లకొట్టనుందని సర్వే అంచనా.
Also Read: AP Politics : సంక్షేమంపై బాబు, పవన్ ఫిదా!
మధ్యతరగతి ప్రజలు AAP పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. వాళ్లను AAP మరియు INC మ్యానిఫెస్టోలు ఆకర్షిస్తున్నాయి. వ్యతిరేక ఓటు ఆప్, కాంగ్రెస్ మధ్య విభజన కానుండడంతో 2023లో BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీస్తుందని సర్వే తేల్చింది. అయితే, ఈ ఫలితాలు ఈనెల 21వ తేదీ వరకు చేసిన సర్వేల ఆధారంగా ఉన్నాయి. గుజరాజ్ ఓటర్లను ఆప్, కాంగ్రెస్ చివరి నిమిషంలో అనుకూలంగా మల్చుకోగలిగితే, బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం తక్కువగా ఉంది. కేవలం 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేల మెజార్టీ మాత్రమే అధికారంలోకి రావడానికి బీజేపీకి ప్రస్తుతం కనిపిస్తోంది. ఆ పార్టీ భవితవ్యాన్ని `ఆప్` తేల్చనుంది. ఇప్పటికే ఆప్ కు కేసీఆర్ మద్ధతు అన్ని రకాలుగా ఉంది. ఇంకో వైపు టీఆర్ఎస్ సహజ మిత్రునిగా ఉన్న ఎంఐఎం గుజరాత్ ఎన్నికల బరిలో కీలకం కానుంది.
తొలుత గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ, ఆయన అటు వైపు చూడలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలపై పూర్తిగా కన్నేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గుజరాత్ వెళ్లకపోయినప్పటికీ తెరవెనుక ఆప్, ఎంఐఎం రూపంలో చక్రతిప్పుతున్నారని బీఆర్ఎస్ వర్గాల్లోని చర్చ. మొత్తం మీద గుజరాత్ ఫలితాలు కేసీఆర్ భవిష్యత్ జాతీయ రాజకీయ ప్రయాణాన్ని నిర్దేశించనున్నాయని సర్వత్రా వినిపిస్తోంది.
Also Read: AP Politics : చంద్రబాబు మాటలపై జగన్ రివర్స్