Ban On Transfers : తెలంగాణలోని ఓటర్ల జాబితా ముసాయిదాను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 3,06,42,333 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వీరిలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది ఇతరులు, 15,337 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 18-19 సంవత్సరాల మధ్య వయసువారిలో తొలిసారి 4,76,597 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారని చెప్పారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,62,552 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,44,170 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,30,989 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,56,995 మంది, అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2,16,648 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలెక్కలు చెబుతున్నాయి.
Also read : Today Horoscope : ఆగస్టు 22 మంగళవారం రాశి ఫలితాలు.. వారికి అతివేగం ప్రమాదకరం
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను వచ్చే నెల (సెప్టెంబర్) 19 వరకు నమోదు చేసుకోవచ్చని వికాస్రాజ్ పేర్కొన్నారు. వాటిని పరిశీలించి అక్టోబరు 4న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల బదిలీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ (Ban On Transfers) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారుల వరకు ఎవరిని ప్రస్తుత విధుల నుంచి బదిలీ చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో బదిలీ చేయాల్సి వస్తే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఏదైనా కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం సీఈఓ స్పష్టం చేశారు.