T-BJP Promise: బీజేపీ అధికారంలోకి రాగానే.. భాగ్యలక్ష్మీ, బైంసా, ఉట్కూర్ గ్రామాలను దత్తత తీసుకుంటా – ‘బండి సంజయ్’

బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం, బైంసా, ఊట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 11:24 PM IST

బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం, బైంసా, ఊట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఊట్కూరులో పోలీసుల చిత్రహింసలకు గురై అనేక కేసులతో ఇబ్బంది పడుతున్న యువకులను ఆదుకోవడంతోపాటు వారికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.

ఊట్కూర్, బైంసాలో హిందువులను చిత్రహింసలు పెట్టిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్త లేదని, వారు ఎక్కడున్నా రప్పించి ప్రజాస్వామ్య, చట్ట బద్దంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 69 జీవోను అమలు చేసి ఊట్కూర్ సహా మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ రాజ్యం స్థాపించడమే తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు. 14వ రోజు పాదయాత్రలో భాగంగా మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎడవెల్లి గేట్ వద్ద బీజేపీ జెండా ఆవిష్కరించారు.

బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పిల్లలు, యువకులు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా భారీ ఎత్తున తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఎండ్ల బండ్లతో సంజయ్ కు స్వాగతం పలికారు. మోటార్ బైక్ ర్యాలీలతో పార్టీ జెండాలు చేతపట్టి బండి సంజయ్ వెంట సాగారు. పాదయాత్ర ఊట్కూర్ చేరుకోగానే బండి సంజయ్ ఊట్కూర్ నేలను ముద్దాడారు. మట్టిని తిలకంగా దిద్దుకున్నారు. అనంతరం ఉట్కూర్ కు తరలివచ్చిన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. టీఆర్ఎసోళ్లు నా చావు కోరుకుంటున్నారు. గుండెపోటు వస్తే కార్యకర్తలు పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో పైదాకా పోయొచ్చిన.

బండి సంజయ్ ను చూసి చావే భయపడుతుంది. హిందూ ధర్మం ఎవరి చావునూ కోరుకోదు. బండి సంజయ్ హిందువని గర్వంగా చెప్పుకుంటాడు. ఊట్కూరులో బీజేపీ కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నారు. గూండాల చేతిలో దెబ్బలు తిన్నా.. కళ్లు, కాల్లు కోల్పోయినా వెరవకుండా యుద్దం చేస్తున్నారు. వాళ్లందరికీ నా సెల్యూట్ చేస్తున్నా అని అన్నారు బండి సంజయ్. 69 జీవోను అమలు చేస్తే మొట్టమొదట నిండేది ఊట్కూరు చెరువే. దీంతో 15 గ్రామాలకు సాగు నీళ్లందుతాయి. బీజేపీ అధికారంలోకి రాగానే 69 జీవోను అమలు చేసి తీరుతాం. ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం. ఈ చుట్టు పక్కల గ్రామాలను సస్యశ్యామలం చేస్తాం.

పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తాం. సీఎం కేసీఆర్… నేను మతతత్వాన్ని రెచ్చగొడుతున్నానట. నేనింకా పూర్తిగా మాట్లాడలేదు. ఉట్కూర్ ప్రజలు హీరోలు.. ఉట్కూర్ యువకుల చరిత్ర విన్న తరువాత చలించిపోయిన. ఉట్కూర్ వీర యోధులు… అంబేద్కర్ వారసులు. సావర్కర్ వారసులు… పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, జైళ్లో పెట్టినా భయపడకుండా వీరోచితంగా పోరాడుతున్నారు.
ఏం తప్పు చేశారన్నా ఊట్కూర్ ప్రజలు… తెలంగాణ సమాజమంతా ఉట్కూర్ హిందువులకు జరిగిన అన్యాయాన్ని వినాలే. సెప్టెంబర్ 3ను బ్లాక్ డే గా ప్రకటిస్తున్నా. అధికారంలోకి వచ్చాక విజయోత్సవ సభలు నిర్వహిస్తాం.
నిజాం కాలంలో రజాకార్లు చేసిన అరాచకాలు తెలుసు… కానీ కేసీఆర్ పాలనలో పోలీసులు ఉట్కూర్ హిందువులను, మహిళలను రాచిరంపాన పెట్టారు. చిత్రహింసలు పెట్టారు. గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? ఉట్కూర్ గ్రామంమీద పడి నా హిందువులను రాచిరంపాన పెట్టిన పోలీసులను వదిలిపెట్టను. మీరు రిటైర్డ్ అయినా, విదేశాలకు పోయినా పక్కా గుంజుకొస్తా. ఒకే గ్రామంలోని 30 మంది రౌడీషీట్, 40 మంది కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టారు. ఒక్కో వ్యక్తిపై గంటలోపే 23 కేసులు బనాయించారు. హిందువుల ఇండ్లల్లోకి చొరబడి కొట్టారు. వాళ్ల భయానికి దాచుకున్నాం.

బయటకు వెళ్లలేక కవర్లలోనే మల, మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి కల్పించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై కేసులున్నాయి. ఎంతమంది కేసులున్నాయి? ఇద్దరు ఎస్పీలు వెయ్యి మంది పోలీసులు ఉట్కూర్ లో దిగి ఒక్కో ఇంటికి 5 గురు పోలీసులొచ్చి హిందువుల ఇండ్లలోకి జొరబడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. రౌడీషీట్, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసి జైళ్లకు పంపారు. టీఆర్ఎస్ నేతలారా… మీది హిందువు పుట్టక పుట్టలేదా?… అకారణంగా చిత్రహింసలు పెట్టి రౌడీ షీట్ పెట్టి జైళ్లకు పంపుతారా… థూ.. మీ బతుకు చెడ.. బైంసాలోనూ ఇదే దుస్థితి. మసీదుపై 4 రాళ్లు వేశారని 4 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం… హిందువుల ఇండ్లపై ఎంఐఎం గూండాలు దాడులు చేసి 21 ఇండ్లను తగలబెడితే నయాపైసా సాయం చేయలే. హిందువుల బైక్ లను తగలపెట్టారు.

హిందువులు చేసుకున్న పిండి వంటల (సకినాలు)పై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా హిందువులపై తిరిగి దాడులు చేశారు. చాలా మంది పోలీసుల బాధలు తాళలేక కోమాలోకి వెళ్లారు. బీహార్ లో 10 శాతం ముస్లిం ఓట్లుంటే ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. 80 శాతమున్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే గొల్లకొండపై కాషాయ జెండా ఎగరుతుంది. తప్పకుండా హిందూ రాజ్యంగా మారుస్తాం. హిందువులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను బీజేపీ మరిచిపోయే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇలాంటి గూండాలపైనా, వారికి మద్దతిస్తున్న పోలీసులను దోషిగా నిలబెడతాం. ప్రజాస్వామ్య, చట్టబద్ధంగా శిక్షించి తీరుతాం అని హెచ్చరించారు బండి సంజయ్.