Ganesh Festival : హైద‌రాబాద్‌లో గ‌ణేష్ ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై మంత్రి త‌ల‌సాని స‌మీక్ష‌

నగరంలో గణేష్ ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన

Published By: HashtagU Telugu Desk
Ganesha

Ganesha

హైదరాబాద్: నగరంలో గణేష్ ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ మర్రి చన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీఐ)లో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గణేష్‌ ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహిస్తోందని, పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడేందుకు మట్టి విగ్రహాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందన్నారు.

ఈసారి కూడా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సుమారు ఆరు లక్షల గణేష్‌ మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని, మట్టి విగ్రహాలతోనే పండుగ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గణేష్ శోభాయాత్ర జరిగే మార్గాలకు సంబంధించి దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. జంటనగరాల్లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రస్తుతం ఉన్న 25 చెరువులు కాకుండా మరో 50 చెరువులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు.

క్రేన్ల ఏర్పాట్లు, లైటింగ్ సిస్టమ్, జనరేటర్లు, ప్రొఫెషనల్ స్విమ్మర్‌ల సేవలు, సరిపడా పారిశుధ్య కార్మికులను డిప్యూటేషన్‌తో సహా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు కోసం అదనపు బలగాలను మోహరించాలని, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులు, షీ టీమ్‌లను కూడా నియమించాలని హోమంత్రి మహమూద్‌ అలీ పోలీసు అధికారులను ఆదేశించారు.

  Last Updated: 17 Aug 2022, 11:17 AM IST