Asaduddin Vs Navneet Kaur : కొన్నేళ్ల క్రితం మజ్లిస్ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ మరోసారి హైదరాబాద్ వేదికగా తిరగదోడారు. ‘‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే మేమేం చేయగలమో చూపిస్తాం’’ అని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మాకు 15 సెకన్లు చాలు.. ఒవైసీ సోదరులిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేది ఎవరికీ తెలియదు’’ అని ఆమె బుధవారం రాత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో బీజేపీ అభ్యర్ధి మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేస్తూ నవనీత్ కౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా గురువారం ఉదయం మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ కామెంట్స్ను కౌంటర్ చేశారు. ‘‘15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండి’’ అని ఎంఐఎం చీఫ్ అన్నారు. ‘‘అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే మేం అక్కడికి వస్తాం’’ అని ఆయన(Asaduddin Vs Navneet Kaur) చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల టైంలో బీజేపీ నేతలు రెచ్చ గొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి వాటివల్ల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని ఎంఐఎం ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. ఎన్నికల నిబంధనలను బీజేపీ నేతలు పదేపదే ఉల్లంఘిస్తున్నా.. ఈసీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవనీత్ కౌర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని వారిస్ డిమాండ్ చేశారు. ‘‘15 నిమిషాల’’ కామెంట్ చేసినందుకు అక్బరుద్దీన్ ఎప్పుడో శిక్షను అనుభవించారని.. మరి ఇప్పుడు నవనీత్ కౌర్పై ఎన్నికల సంఘం చర్యలు ఎప్పుడు తీసుకుంటుందని వారిస్ ప్రశ్నించారు.
‘‘రాజ్యాంగం అందరికీ సమానం. అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. అప్పుడు అక్బరుద్దీన్ది తప్పు అయితే ఇప్పుడు నవనీత్ కౌర్ది కూడా తప్పే అవుతుంది’’ అని వారిస్ పఠాన్ పేర్కొన్నారు. నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు ఆమె గుజరాత్లోని ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జై శ్రీరాం అనడానికి ఇష్టపడని వారు పాకిస్థాన్కు వెళ్లొచ్చన్నారు. దీనిపై ఆనాడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. అప్పట్లో దీనిపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.