కాంగ్రెస్ పార్టీ( T Congress) నిర్వహించిన సత్యమేవ జయతే సభ విజయవంతం అయింది. ఆ వేదికపై సీనియర్లు కలివిడిగా ఉండడం ఆ పార్టీకి శుభపరిణామం. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. సభ ముగిసే వరకు ఏదో నవ్వుకుంటూ ముగ్గురూ ఒకటే అనే సంకేతాన్ని పంపారు. ఆ దృశ్యాన్ని చూసిన సగటు కాంగ్రెస్ వాది మంచి రోజులు తెలంగాణ కాంగ్రెస్ కు వచ్చాయని భావించడంలో తప్పులేదు.
అదే వేదికపై నుంచి వ్యూహాత్మకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అవి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఆయన కలలు కంటోన్న సీఎం పదవికి ఎసరు పెట్టేలా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేయాలని ఆయన సంకేతాలు ఇచ్చారు. అంటే, భట్టీ విక్రమార్క్ ను సీఎం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా ప్రతిపాదన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, దళితుడ్ని సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయడం గమనార్హం. అయన మాట తప్పారు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ (T Congress)దళితుడ్ని సీఎం చేయాలని కోరడం గమనార్హం.
సీఎం పదవి కోసం రాజకీయాలు చేస్తున్నానని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రస్తావించారు. ఆ పదవిని కోరుకోవడంలో తప్పులేదని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. అందుకే, పీసీసీ పదవిని కూడా వదులుకోవడానికి ఒకానొక సందర్భంలో సిద్ధం అయ్యారు. స్టార్ క్యాంపెయినర్ గా ఇస్తే చాలనే అభిప్రాయాన్ని కూడా అప్పట్లో వెలుబుచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు పీసీసీ చీఫ్ గా(T Congress) ఉన్నారు. పార్టీని బలోపేతం చేస్తారని రేవంత్ కు కీలక పదవిని ఏఐసీసీ అప్పగించింది. అయితే, రేవంత్ కారణంగా పార్టీ బలహీనపడిందని తాజా సర్వేల సారాంశం. అదే విషయాన్ని సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఎక్కువ అయ్యాయి. పలువురు పార్టీని వీడి వెళ్లిపోయారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా పార్టీని నడుపుతున్నారని శ్రవణ్ లాంటి వాళ్లు ఆరోపణలు గుప్పించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. పార్టీలో ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని సొంత పార్టీలోని సీనియర్లను డ్యామేజ్ చేసేలా రేవంత్ రెడ్డి గేమాడుతున్నారని సీనియర్లు కొందరు చేసే ఆరోపణ. ఏ మాత్రం ఆయన పద్దతి బాగాలేదని బాహాటంగా మీడియా ముందుపలుమార్లు జగ్గారెడ్డి లాంటి వాళ్లు వాపోయారు.
Also Read : Pawar shocked the Congress: కాంగ్రెస్కు షాకిచ్చిన పవార్
పాత, కొత్త కాంగ్రెస్ మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్(T Congress) విభాగం మారింది. ఆ క్రమంలో భట్టీ విక్రమార్క్ అందరికీ ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నారు. కార్తీక వనసమారాధన సందర్భంగా రెడ్డి సామాజికవర్గానికి రాజ్యాధికారం ఉండాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను హోంగార్డులతో పోల్చుతూ తనకుతాను ఐపీఎస్ లాంటోడ్ని అంటూ రేవంత్ కితాబు ఇచ్చుకున్నారు. ఇలాంటి పరిణామాలు ఆయన నాయకత్వానికి గొడ్డలిపెట్టుగా మారాయి. అలాగని, కోమటిరెడ్డి, ఉత్తమ్ తదితరులకు రేవంత్ వర్గం మద్ధతు ఇచ్చే అవకాశం లేదు. అందుకే, మధ్యేమార్గంగా భట్టీ విక్రమార్క్ ను ఏఐసీసీ ఫోకస్ చేసింది. రాబోయే రోజుల్లో ఆయనే సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్స్ ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఆ దిశగా మంచిర్యాల వేదికగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ల చేయడం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వర్గాన్ని కార్నర్ చేయడమేనని కాంగ్రెస్ వర్గాల్లోని చర్చ.
Also Read : Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!