Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రైవేటు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్కు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేశారు. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలతో పాటు విపక్ష నేతలఫోన్లను ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో శ్రవణ్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న శ్రవణ్.. అమెరికాలో తలదాచుకున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ తిరస్కరణ ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టులో శ్రవణ్ అప్పీల్ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు బెంచ్.. ఇవాళ ఆయనకు ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
Also Read :Aalim Hakim : సూపర్ స్టార్లు, మెగా క్రికెటర్లకు ఈయనే హెయిర్ స్టయిలిస్ట్
శ్రవణ్ తరఫు న్యాయవాది వాదన
శ్రవణ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం శ్రవణ్ కుమార్ అందుబాటులో ఉంటారు. ఆయన విచారణకు సహకరిస్తారు. ఇప్పటివరకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41A కింద ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. మధ్యంతర రక్షణ ఇస్తే 48 గంటల్లోగా శ్రవణ్ కుమార్ భారత్ వస్తారు’’ అని సుప్రీంకోర్టు బెంచ్కు దామా శేషాద్రి నాయుడు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదన
‘‘నిందితుడు శ్రవణ్కు(Phone Tapping Case) ఎలాంటి రక్షణ ఇవ్వొద్దు. ఆయన తప్పించుకుని విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశాం. గత ఏడాది కాలంగా పరారీలోనే ఉన్నారు’’ అని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యలు
ఇరుపక్షాల వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్.. ‘‘ ఇవాళ శ్రవణ్ కుమార్ను అరెస్టు చేస్తున్నారా ?’’ అని శ్రవణ్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘‘ప్రస్తుతం శ్రవణ్ అమెరికాలో ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయలేదు. శ్రవణ్కు మధ్యంతర రక్షణ ఇవ్వకపోతే, ఆయన భారతదేశానికి రాడు. ముందు అతడిని దేశానికి రానివ్వండి’’ అని ఈసందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.