తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డెబిట్ కార్డు సైజులో, అత్యాధునిక క్యూఆర్ (QR) కోడ్తో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయి, అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. అత్యంత నాణ్యతతో రూపొందించిన ఈ కార్డుపై కుటుంబ యజమాని ఫొటో, పేరు, పూర్తి చిరునామాతో పాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను అధికారికంగా ముద్రించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ సరికొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది.
ఈ సరికొత్త క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం మరింత పెరగనుంది. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే.. సదరు లబ్ధిదారుల కుటుంబ వివరాలు, ప్రతి నెల వారు తీసుకుంటున్న రేషన్ కోటా, క్యారీ ఓవర్ బ్యాలెన్స్ వంటి పూర్తి సమాచారం కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది. దీనివల్ల రేషన్ దుకాణాల్లో జరిగే అక్రమాలకు, బినామీ కార్డుల దోపిడీకి పూర్తిగా చెక్ పడనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. పాత పేపర్ కార్డుల స్థానంలో రాబోతున్న ఈ స్మార్ట్ డిజిటల్ కార్డులు నిరుపేదలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, పర్సులో సులభంగా భద్రపరుచుకునేలా ఉండటం విశేషం.
