సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తోంది. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలోని నేత కళాకారులు తయారుచేసిన ‘రాజన్న సిరిపట్టు’ పట్టుచీరలు న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్ లో శనివారం అవిష్కరించారు. ఈ చీరలను ఆవిష్కరించిన ప్రియాంకకు తెలంగాణ టెక్సటైల్ శాఖా మంత్రి కె.తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.న్యూజిలాండ్ లో రాజన్న సిరి పట్టు బ్రాండ్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కేటీఆర్ వీడియో సందేశం పంపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కారణ కావడం అత్యంత సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను మంత్రి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేత కళాకారులు నేడు వినూత్న ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి చేరుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ ఇలాంటి నేతన్నల నైపుణ్యం వల్ల సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేస్తున్నట్లు వివరించారు. సిరిసిల్ల రాజన్న సిరి పట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణకు వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్లలోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకుంది. అప్పుడే సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకొని, ఆయనతో పట్టుచీరలు తయారు చేయించి, అమెరికా, యూకే, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లోని తెలిసిన వారికి, సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డర్లు ఇప్పించారు. అయితే సిరిసిల్ల పట్టుచీరలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘రాజన్న సిరిపట్టు’గా నామకరణం చేసి న్యూజిలాండ్ లో ఉత్పత్తులను ప్రదర్శించారు.
ఈ పట్టుచీరలతో ఒక ఫ్యాషన్ షోను కూడా నిర్వహించారు. తన ఆలోచనకు, అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రవాసీ మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందని బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 40 మందికి పైగా నేత్నలకు ఉపాధి లభిస్తోందదని వివరించారు. ఈ పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చెప్పారు. వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలు ఎంతో ఇష్టమని, తెలంగాణకు చెందిన బతుకమ్మ సంబరాల కోసం ప్రవాసీలు తనని ఆహ్వానించిన ప్రతిసారి, వాటినే ధరిస్తానన్నారు. పట్టుచీరలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో సిరిసిల్లకు చెందిన ఒక పట్టుచీరను ధరించి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విషయం ట్విటర్ ద్వారా తెలుసుకొన్న కేటీఆర్, ఆ తరువాత హైదరాబాద్ లో ఒక సమావేశంలో కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు.
My wholehearted compliments to New Zealand Minister @priyancanzlp Garu & Sunita Vijay Garu for launching “Rajanna Siri Pattu” Sarees in NZ
Taking Siricilla weavers’ products global through “Brand Telangana” is a great step forward in helping talented weavers like Sri Hari Prasad https://t.co/rJHl0EVf0p
— KTR (@KTRTRS) September 18, 2022