తెలంగాణ (Telangana) లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మరోవైపు ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు దీమాను వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ( ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణలోనూ పడింది. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకుంది. పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏఏ కార్యక్రమాలను అమలు చేస్తుంది, ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది అనేది విషయాలపై ఆ పార్టీ నేతలు స్పష్టత ఇస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వల్ప మేనిఫెస్టోనుసైతం విడుదల చేశారు. అయితే, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని తెలంగాణలోనూ అమలు చేయనున్నారు. వీటిల్లో ప్రధానమైంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
తెలంగాణ మహిళల సాధికారత కోసం మరియు ఆర్టీసీని బలోపేతం చేసేందుకు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం.
నెరవేర్చే హామీలే ఇస్తాం..!
ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తాం..!!#TelanganaCongressGuarantees pic.twitter.com/8ahbmhvcAl— Telangana Congress (@INCTelangana) June 20, 2023
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలమైంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ కార్యక్రమం అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించింది.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, విద్యార్థులు ఈ పథకానికి ఆకర్షితులయ్యారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ ఈ హామీ ప్రత్యక్షమైంది. మరి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు విజయతీరాలకు చేర్చుతుందో వేచిచూడాల్సిందే.