Site icon HashtagU Telugu

Rs 5000 Fine: నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేలు జరిమానా..!

Rs 5000 Fine

Rs 5000 Fine

Rs 5000 Fine: నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు (Rs 5000 Fine) తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ… జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. రానున్నరోజులలో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేసారు. అలాగే నల్లలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగితా వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా కావడంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్బంగా వెల్లడించారు.

వేసవిలో తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని మార్గాలపై జలమండలి ప్రత్యే దృష్టి సారించింది. ఇప్పటి వరకు తాగునీరు సరఫరాలో ఎలాంటి కొరత లేనప్పటికి కొందరు వినియోగదారుల తీరుతో లో ప్రెషర్‌ (తక్కువ ఒత్తిడి)తో నీటి సరఫరా సమస్య ఉత్పన్నం కావడాన్ని జలమండలి సీరియస్‌గా పరిగణించింది. నల్లాకు అక్రమంగా మోటర్లు బిగించే కనెక్షన్‌ దారులపై కొరఢా ఝలింపించాలని నిర్ణయించింది.

Also Read: GT vs RR: రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై గుజ‌రాత్ ఘ‌న‌విజ‌యం.. టాప్ పొజిష‌న్‌లో టైటాన్స్‌!

జరిమానాలు, మోటర్‌ సీజ్‌కు సిద్దమైంది. కొందరు నల్లా లకు మోటర్లు బిగిస్తుండటంతో 60 శాతం కనెక్షన్‌ దారులకు హైప్రెషర్‌తో సమృద్దిగా నల్లా నీరు సరఫరా, మోటరు లేని 40 శాతం వినియోగదారులల్లో 20 శాతం సాధారణంగా, మరో 20 శాతం పెష్రర్‌తో కూడిన నీరు సరఫరా అవుతుండటంతో మెట్రో కస్టమర్‌ సెంటర్‌(ఎంసీసీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే నల్లా నీటి విడుదలలో సమయ పాలనా పాటిస్తున్నా.. లో పెషర్‌ ఫిర్యాదుల తాకిడి ఎగబాగుతుండంతో ఇటీవల జలమండలి వాస్తవ పరిస్ధితిపై థర్డ్‌ పార్టీ ద్వారా ఆరా తీసింది.

నీటి సరఫరా సమయంలో నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్లు గుర్తించింది. నీటి పెష్రర్‌ కోసం కోసం వినియోగించే సాధారణ మోటర్లతోపాటు తాజాగా మార్కెట్‌లో వచ్చిన ఆటోమెటిక్‌ మెటర్ల కూడా వినియోగిస్తుండటంతో హైస్పీడ్‌ ప్రెషర్‌ పెరిగి దిగువ, చివరి కనెక్షన్‌దారులకు∙నీటిసరఫరా అంతంతమాత్రంగా తయారైనట్లు బయటపడింది. నల్లా లకు బిగించే సాధారణ మోటర్లు ఆన్‌ చేస్తే పనిచేస్తుండగా, ఆటోమెటిక్‌ మోటర్లు నల్లా సరఫరా ప్రారంభంకాగానే ఆటోమెటిక్‌గా పనిచేయడం ప్రారంభిస్తుండటంతో మిగితా కనెక్షన్లకు పెష్రర్‌ కూడిన నీటి సరఫరా సమస్యగా తయారైంది.

జూమ్‌ మీటింగ్‌ల ద్వారా ఆదేశాలు

జలమండలి ద్వారా సరఫరా జరిగే నల్లా నీరు లో పెష్రర్‌తో కాకుండా ఎప్పటిక మాదిరిగానే సరఫరా జరిగే విధంగా జలమండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రెండు రోజుల క్రితం లో ప్రెషల్‌ ఫిర్యాదులు అధికంగా గల ఓ అండ్ డివిజన్‌ 6లోని సుమారు 110 లైన్‌మెన్లతో ఎండీ అశోక్‌ రెడ్డి ప్రత్యేక జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. లో పెష్రర్‌ నీటిసరఫరా కారణాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో నీటి సరఫరా, ప్రస్తుతం నీటి సరఫరా ఎంజీడీలు, సమయాల్లో ఎలాంటి తేడా లేనప్పటికి కొన్ని కనెక్షన్‌కు 80 శాతం నీరు, మరికొని కనెక్షన్లకు 20 శాతం నీరు సరఫరా కావడమేమిటని ప్రశ్నించారు. మోటర్లు బిగించే నల్ల కనెక్షన్ల దారులను గుర్తించి, తక్షణమే మోటర్లను సీజ్‌ చేసి జరిమానా విధించాలని సూచించారు.

అదే విధంగా అన్నీ సర్కిల్‌ సీజీఎం, డివిజన్‌ జీఎం, డీజీఎం, సెక్షన్‌ మేనేజర్లతో కూడా జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి నీరు సరఫరాలో సాధారణ ప్రెషర్‌ ఉండే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా ‘మోటర్‌ ఫ్రీ టాప్‌ వాటర్‌’ పేరుతో కార్యాచరణ ప్రకటించారు.

నాలుగు దశలుగా తనిఖీలు

వేసవిలో ‘మోటర్‌ ఫ్రీ టాప్‌ వాటర్‌’ లక్ష్యంగా నాలుగు దశల తనిఖీలకు జలమండలి సిద్దమైంది. నల్లా నీటి సరఫరాలో లో పెష్రర్‌కు చెక్‌ పెట్టి సాధారణ స్థాయి వత్తిడితో నీటి సరఫరా జరిగే విధంగా ‘మోటర్‌ ఫ్రీ టాప్‌ వాటర్‌’ పేరుతో ఈ నెల 15(మంగళవారం) నుంచి వాటర్‌ స్పెషల్‌ డ్రైవ్‌ అమలు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో నల్లానీటి సరఫరా సమయంలో లైన్‌మెన్‌ నుంచి ఎండీవరకు పర్యటించి తనిఖీలు నిర్వహించనున్నారు. వేసవి ముగిసే వరకు అకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. మొదటిదశలో లైన్‌మెన్లు వాటర్‌వాల్వ్‌ తిప్పగానే సరఫరా చేసే లైన్లలో కనెక్షన్‌ టూ కనెక్షన్‌ పరిశీలించి వాటర్‌ ప్రెషర్, మోటర్ల వినియోగాన్ని గుర్తిస్తారు.

రెండో దశలో మరుసటిరోజు (రోజు విడిచి రోజు) సెక్షన్‌ మేనేజర్‌ అదే లైన్‌లో నల్లా నీటిసరఫరా.. మోటర్ల వినియోగాన్ని గుర్తించి నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి తక్షణమే మోటర్‌ సీజ్‌ చేస్తారు.క్యాన్‌ నెంబర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లు పెడుతారు. ఆ తర్వాత లైన్ల వారిగా (క్యాన్‌నెంబర్ల జాబితా)తో ‘మోటర్‌ ఫ్రీ టాప్‌వాటర్‌’ లైన్లుగా జీఎంలకు ఆన్‌లైన్‌ నివేదిక సమరిస్తారు.

మూడో దశలో మేనేజర్ల నివేదిక ఆధారంగా జీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్లను ర్యాండమ్‌గా పరిశీలించి సంతృప్తి వ్యక్తమైతే సీజీఎంలకు నివేదిక సమర్పిస్తారు. అక్కడ నుంచి డెరెక్టర్, డైరెక్టర్‌నుంచి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లాగిన్‌ కు రోజువారిగా ఆన్‌లైన్‌ నివేదిక సమర్పిస్తారు. నాలుగో దశలో ఆ నివేదికలను బట్టి క్రాస్‌ చెక్‌ కోసం సీజీఎం, డైరెక్టర్, ఎండీలు క్షేత్ర స్థాయిలో ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహిస్తారు. జరిమానాలు విధించడం, మోటర్లు సీజ్‌ చేయడంకొనసాగిస్తారు.

ప్రత్యేకమైన యాప్ రూపకల్పన

నీటి నల్లాలకు మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నీటి నల్లాలకు మోటార్లను బిగించినా, తాగడానికి కాకుండా ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో, నిర్మాణ పనుల కోసం నీటిని వృధా చేస్తే జరిమానా విధించడానికి ఈ యాప్ ని రూపొందించారు.

రెండు రోజుల్లో ఈ యాప్ ని జీఎంనుంచి క్షేత్ర స్తాయిలోని లైన్ మెన్ల వరకు అందరికి అందుబాటులోకి తెస్తారు. వీరు ఆ ప్రాంతాల్లో ఇల్లీగల్ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, నీటి వృధా చేస్తున్న వినియోగదారులను గుర్తించి ఫోటో తో సహా యాప్ లో అప్లోడ్ చేయడం.. సదరు కనెక్షన్ గుర్తించి ట్యాగ్ చేయడం తో వెంటనే ఆ కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ పై జరిమానా మంజూరు చేయడంతో సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు పెనాల్టీ జమ అవుతుంది. అలాగే ఈ మొత్తం వచ్చే నెల బిల్ లో చెల్లించేలాగా రూపొందించారు. అనంతరము రెండో దశలో నీటి సంరక్షణ కోసం చేసేందుకు ఏ పౌరులకు సైతం వాలెంటర్ గా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తారు.