వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు హైవేపై సోమవారం తెల్లవారుజామున బస్సు ట్రాక్టర్ను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు కొత్తకోట మండలం ముమ్మలపల్లి సమీపంలో వెనుక వైపు నుంచి చెరకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు వనపర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్, క్లీనర్, ఒక ప్రయాణికుడు మృతి చెందారని.. మరో 15 మంది గాయపడినట్లు తెలిపారు. మృతులు ఆంజనేయులు (42), సందీప్ (35), శివన్న (56)గా గుర్తించారు. క్షతగాత్రులు వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని మియాపూర్ డిపోకు చెందిన బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో వోల్వో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ ప్రమాదంతో హైవేపై దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.