Dharani Portal : ధరణి పోర్టల్ లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 11:11 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధరణి పోర్టల్ (Dharani Portal) లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు. భూమి సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలని పేర్కొన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

ధరణి ప్రారంభంనుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని ముఖ్యమంత్రి సి.ఎస్ ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి దామోదర రాజ నర్సింహా, రెవిన్యూ, హోసింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Read Also : Bad News for Bad Guys : RGV ‘వ్యూహం’ నికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్..