Site icon HashtagU Telugu

Revanth to KCR:కేసీఆర్ కి మళ్ళీ బహిరంగ లేఖ రాసిన రేవంత్

Revanth reddy

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో పై దుమారం రేగుతోంది. ఉద్యోగుల స్థానికత పునాదిగా మెదలైన తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం సాధించిన ఏడేళ్ల తర్వాత అదే స్థానికత కోసం కన్నీళ్లు పెట్టాల్సివస్తోంది.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.

తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది.

ఇదే అశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు. ఇటీవల వరిధాన్యం అంశంపై కూడా రేవంత్ కేసీఆర్ కి లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయని, సొంత జిల్లాలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని రేవంత్ తెలిపారు.

ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఉమ్మడి జిల్లా యూనిట్ గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని సీనియర్లకు వారి అప్షన్ మేరకు పోస్టింగ్ లు ఇస్తున్నారని, దీంతో ఉద్యోగుల పిల్లలు దాదాపు 20-30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ తెలిపారు.

బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్న పళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో రిటైర్మెంట్ వరకు ఆ జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోందని, తిరిగి సొంత జిల్లాకు వచ్చే మార్గమే లేదని రేవంత్ తెలిపారు.

సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని రేవంత్ సీఎంని కోరారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్ లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారమే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగానే బదిలీలు చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.

అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని, ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలని రేవంత్ ముఖ్యమంత్రిని కోరారు.