Site icon HashtagU Telugu

Red Warning: తెలంగాణ‌లోని ఈ జిల్లాల‌కు రెడ్ వార్నింగ్‌!

Red Warning

Red Warning

Red Warning: తెలంగాణలోని కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Warning) జారీ చేసింది. రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ ఈ హెచ్చరికలు జారీ చేసింది.

మ‌ధ్య‌స్థాయి నుంచి తేలిక‌పాటి వర్షాలు

కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన నివేదికలో పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.

ఇతర జిల్లాల్లో వాతావరణం

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలైన ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో వర్షం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని అంచనా వేసింది.

Also Read: Asia Cup: ఆసియా క‌ప్ టీ20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్ల జాబితా ఇదే!

అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు

ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, రహదారులపై నీరు నిలవడం వంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రైతులు కూడా తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని లోత‌ట్టు కాల‌నీల ప్రజలు నీటిలో చిక్కుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, లేకపోతే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఈ అప్రమత్తత కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.