Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు (చెరుకు రామయ్య) తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం (ఈ నెల 5న) ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో రామోజీరావును చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెలో స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు 87 ఏళ్ల రామోజీరావు కన్నుమూశారు. ఫిల్మ్సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలను రామోజీరావు నెలకొల్పారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో ఆయన భాగమయ్యారు. ‘పనిలోనే విశ్రాంతి’ అనే నినాదంతో రామోజీరావు ముందుకు సాగేవారని ఈనాడు గ్రూపు కంపెనీలలో పనిచేసేవారు చెబుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న దార్శనికుడు రామోజీరావు. తెలుగు పత్రికా రంగంలో ఈనాడుతో ఆయన పెను సంచలనం క్రియేట్ చేశారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మీడియాలో వైఖరిని తీసుకున్నారు. న్యూస్ టైమ్ అనే ఇంగ్లిష్ పత్రికను కూడా గతంలో రామోజీరావు ప్రారంభించారు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఆయన పెట్టిన మిగతా వ్యాపారాలన్నీ బాగా సక్సెస్ అయ్యాయి.