Poasani Krishna Murali : టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అనారోగ్యానికి గురయ్యారు. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని, తనకు నలతగా ఉందని చెప్పడంతో పాటు ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో వైద్యులు ఆయనను పరిశీలించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండె సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నందున వైద్యులు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో సమస్యలు ఉన్నట్లు గుర్తించడంతో ఆయనను కడపకు తరలించి చికిత్స అందించే అవకాశాలు ఉన్నాయి.
Read Also: TDP : రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు : వంగలపూడి అనిత
పోసాని కృష్ణమురళి అరెస్టు అయినప్పటి నుంచి తీవ్రంగా టెన్షన్ పడుతున్నారని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అరెస్టు సమయంలో పోలీసులతో విపరీతంగా ప్రవర్తించిన పోసాని, తన ఇంట్లో జరిగిన ఈ సంఘటనలను రికార్డు చేసి మీడియాకు అందించారు. పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి పై ఇంకా స్పష్టత లేదు కానీ, ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేసినందున, ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో ఆయనను రిమాండ్ కు తరలించారు.
మరోవైపు పోసాని కృష్ణమురళి చేసిన బెయిల్ పిటిషన్ పై రైల్వే కోడూరు కోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈరోజు, రేపు కోర్టుకు సెలవు కావడంతో పిటిషన్ ను సోమవారం విచారించనున్నారు. ఇకపోతే.. పోసానిని తమకు అప్పగించాలంటూ అనంతపురం, రైల్వేకోడూరు అర్బన్ పీఎస్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ వేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుత కేసులో బెయిల్ వచ్చినా ఇతర కేసుల్లో పోసానిని అరెస్ట్ చేసేందుకు ఆయా పోలీస్ స్టేషన్ల పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
Read Also: Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?