Police Notice : బీజేపీ ఎంపీ అర్వింద్‌కు నోటీసులు

2020లో అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 02:17 PM IST

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (MP Dharmapuri Arvind)కు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో పోలీసులు నోటీసులు (Police Notice) ఇచ్చారు. 2020లో అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలనే నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి ఈ కేసు అరవింద్ ను వెంటాడుతూనే ఉంది.

ఈ క్రమంలో మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు మంగళవారం నగర పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంపీ అర్వింద్‌ అందుబాటులో లేరు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర పర్యటనలో భాగంగా బస్వా గార్డెన్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఉన్నారనే సమాచారం మేరకు నాలుగో టౌన్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. నోటీసు విషయంపై ఎంపీతో చర్చించారు. నోటీసు తీసుకోవాలని పోలీసులు కోరగా అందుకు ఎంపీ అరవింద్‌ నిరాకరించారు. ఎన్నికలు ముగిసి దాదాపు నాలుగేళ్ల తర్వాత నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారుల సూచనతో వెనుదిరిగారు. కొద్దిరోజుల్లోనే ఈ నోటీసును ఆయన ఇంటి అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదంటే అధికారిక మెయిల్‌ ఐడీకి పంపనున్నట్టు పోలీసులు తెలిపారు.

Read Also : AP : ఢిల్లీలో మోడీ..అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి లోకేష్ తిరుగుతున్నాడు – మంత్రి రోజా