Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. తొలుత ఇద్దరు లేదా ముగ్గురు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఇటీవల ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విచారణ జరుగు తోందని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే వ్యవహారాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎంక్వయిరీ చేసిన అధికారులు, వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఇంటెలీజెన్స్ (ఎస్ఐబీ) విభాగం అధికారులు ఓఎస్డీ రాధాకిషన్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఒక టాపిక్ కామన్గా ఉంది. అప్పట్లో ఇంటెలీజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నిర్వహించామని నిందితులంతా చెప్పారు. ఏయే నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలనే దానిపై డైరెక్షన్స్ నేరుగా ప్రభాకర్ రావు నుంచే అందేవని తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి రాకుండా అనారోగ్యం పేరుతో విదేశాల్లో ఉన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానని ప్రభాకర్ రావు అంటున్నారు. ఆయన అమెరికాలో ఉన్నారని కొందరు చెబుతుంటే.. దుబాయ్లో ఉన్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పుడు ఆయన్ను హైదరాబాద్కు రప్పించడం ఇన్వెస్టిగేషన్ టీమ్కు అత్యవసరంగా మారింది. ఈక్రమంలోనే ఇప్పటికే ప్రభాకర్ రావు పేరిట లుకౌట్ నోటీసును జారీ చేశారు. అయినా ఇప్పటిదాకా ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఆయనను భారత్కు రప్పించడానికి ఉన్న మార్గాలపై న్యాయ నిపుణుల సలహాలను తెలంగాణ సర్కారు తీసుకుంటోందని తెలుస్తోంది. కొందరు మాజీ ఇంటెలీజెన్స్ విభాగం అధికారుల రిమాండ్ రిపోర్టుల్లో ఇదే విషయాన్ని పోలీసులు ప్రస్తావించారు. ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు టీం భావిస్తోంది.
ఈనేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంతో సంబంధమున్న బీఆర్ఎస్ నేతల నుంచి ప్రభాకర్ రావుపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వారితో ఆయన టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావొద్దని, హాజరైతే ఇరుక్కుపోతామని ఆయనకు వారు సూచించినట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకోసమే ప్రభాకర్ రావు హైదరాబాద్కు రావడం లేదని అంటున్నారు. ప్రభాకర్రావు విచారణకు హాజరైతే వాటిని ధ్రువీకరించే తీరులోనో… తిరస్కరించే విధంగానో స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన నోరు విప్పితే కొంతమంది కీలకమైన బీఆర్ఎస్ లీడర్ల పేర్లు బయటికి వస్తాయని తెలుస్తోంది. అది రాజకీయంగా మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందనేది వారి భయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్రావు ఏ నిర్ణయం తీసుకుంటారు ? బాధ్యతాయుత మాజీ పోలీసు అధికారిగా దేశానికి తిరిగొచ్చి విచారణకు సహకరిస్తారా ? అమెరికాలోనే ఉంటారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.