Phone Tapping Case : తెలంగాణలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారి తిరుపతన్న బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Phone Tapping Case) గడువు కోరింది. దీంతో రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు బెంచ్ రెండు వారాల సమయాన్ని మంజూరు చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 18వ తేదీకి వాయిదా వేసింది.
Also Read :Shinde Plan B : సీఎం సీటు దక్కకుంటే ఏక్నాథ్ షిండే ప్లాన్-బీ ఇదే
ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతకుముందు బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు అప్పట్లో హైకోర్టుకు తెలిపారు. కేసు కీలకమైన విచారణ దశలో ఉన్నందున ఆయనకు బెయిల్ ఇస్తే, దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తిరుపతన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read :Digital Panchayats : ఏపీలో ‘స్వర్ణ పంచాయతీ’.. 13,326 పంచాయతీల్లో డిజిటల్ సేవలు
ఇంతకుముందు సుప్రీంకోర్టులో అక్టోబర్ 24న విచారణ జరిగింది. అప్పుడు కూడా జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనమే విచారణ జరిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసి మూడు నెలలైనా హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో ప్రశ్నించింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. అప్పుడు వాయిదా వేసిన విచారణను.. ఈరోజు మళ్లీ సుప్రీంకోర్టు నిర్వహించింది. కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు బెంచ్ను కోరారు. దీంతో మరో 2 వారాల టైంను మంజూరు చేశారు.