కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో (Lagacharla ) కలెక్టర్, అధికారులపై దాడి (Attack on collector and officials) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన పలువురు నిందితులపై కేసులు నమోదు కావడం, రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇక ఇప్పుడు అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిగి డీఎస్పీ (Parigi DSP) వైఫల్యంతోనే కలెక్టర్, అధికారులపై దాడి జరిగిందని గుర్తించిన ప్రభుత్వం డీఎస్పీ కరుణసాగర్ పై బదిలీ వేటు వేసింది. డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పరిగి డీఎస్పీగా శ్రీనివాస్ ను నియమించింది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్, అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లగా సరైన భద్రత కల్పించకపోవడంతో గ్రామస్తులు దాడి చేసినట్లు ప్రభుత్వం భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే ఈ దాడి కేసులో మరికొన్ని విషయాలు బయటకొచ్చాయి. పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ ఈ దాడి ఘటనలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. లగచర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ కలెక్టర్, అధికారులపై దాడి చేయాలని గ్రామ ప్రజలు, రైతులను రెచ్చకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also : Deputy Mayor: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: డిప్యూటీ మేయర్