NTR Ghat Issue : `ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం.` అనేది సామెత. దాన్ని బీఆర్ఎస్ పార్టీలోని కల్వకుంట్ల కుటుంబానికి వర్తింప చేస్తే అతికినట్టు సరిపోతుందేమో! అనిపిస్తోంది. ఎందుకంటే, స్వర్గీయ రామారావును ఆకాశానికి ఎత్తేశారు మంత్రి కేటీఆర్. ఖమ్మం వెళ్లిన ఆయన ఎన్టీఆర్ పేరును స్తుతించారు. అంతేకాదు, కేసీఆర్ ను ఎన్టీఆర్ శిష్యునిగా పోల్చారు. అంత అభిమానం, ప్రేమ ఎన్టీఆర్ మీద ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహాన్ని ఎందుకు కూల్చారు? అంటే అది ఉద్యమకాలం అంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను ఆంధ్రాకు పరిమితం చేస్తూ మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు తెలుగు వాళ్లకు ఆయనో ఐకాన్ అంటూ ప్రశసించడం మొదలు పెట్టారు.
ఎన్టీఆర్ మీద అభిమానంతో కుమారుడికి తారక రామారావు అనే నామకరణం చేశానని సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ, అందుకు మంత్రి కేటీఆర్ టీవీ ఇంటర్వ్యూల్లో అంగీకరించలేదు. పుట్టిన నక్షత్రం ప్రకారం తారక రామారావు అంటూ నామకరణం చేశారని కేటీఆర్ చెబుతారు. తండ్రీ ఒకటి చెబితే, కుమారుడు మరోకటి చెబుతారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎప్పుడు ఏది మాట్లాడినా తెలంగాణ సమాజం నమ్మినంత వరకు ఏదైనా చెబుతారు. ఒకప్పుడు తెలుగుగంగకు నీళ్లు తీసుకెళ్లిన ఎన్టీఆర్ ను (NTR Ghat Issue) విమర్శించారు. ఇప్పుడే అదే ఎన్టీఆర్ ను మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తారు.
మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్లి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. వాళ్ల ఓట్లు కావాలి. అందుకే, ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. అదే ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి అంటరానిది. ఆ పార్టీ నుంచి రాజకీయంగా ఎదిగిన కేసీఆర్ తిన్నింటి వాసాలు లిక్కపెట్టిన (NTR Ghat Issue) విధంగా తెలంగాణలో నామరూపాల్లేకుండా చేశారు. అదో ఆంధ్రా పార్టీ అంటూ ముద్ర వేశారు. సమైక్యవాదాన్ని అసెంబ్లీ వేదికగా వినిపించిన కేసీఆర్ ప్రత్యేక ఉద్యమం చేపట్టారు. అదే మంత్రి పదవిని 2001లో చంద్రబాబు ఇచ్చి ఉంటే, ఉద్యమం ఉండేదికాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే.
Also Read : KTR vs Lokesh: కేటీఆర్ కి లోకేష్ కౌంటర్…హైదరాబాద్ శాంతిభద్రతలపై కోల్డ్ వార్
ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు జైలుకు వెళ్లడంపై మంత్రి కేటీఆర్ స్పందించానికి ఇష్టపడరు. తెలుగుదేశం పార్టీ మాటెత్తితే, చిరాకుపడతారు. అవసరమైనప్పుడు ఆంధ్రా కావాలి. ఆంధ్రా కాంట్రాక్టర్లు అవసరం. సెటిలర్ల ఓట్లు అనివార్యం. కానీ, ఆంధ్రాలో జరిగే రాజకీయాలు పట్టవు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలి. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమో! మంత్రి కేటీఆర్ చేస్తుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ఉచ్చరించకుండా ఖమ్మంలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆ మేరకు నాలుక తిప్పారు. కృష్ణుడు అయినా, రాముడైనా తమకు ఎన్టీఆర్ ఆరాధ్యమంటూ ఖమ్మం ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
హైదరాబాద్ నగరంలోకి ఎన్టీఆర్ ఘాట్ కు (NTR Ghat Issue) ప్రత్యేకమైన పేరుంది. అదో పర్యాటక ప్రాంతంగా ఉంది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉండగా, దానికి భూములను కేటాయించడంతో పాటు ఆయన ఘాట్ ను నిర్మించారు. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను స్మరించుకుంటారు. ఆ ఘాట్ ను సందర్శనీయ ప్రాంతాల్లో ఒకటిగా అప్పట్లో మార్చారు. ఎన్టీఆర్ గార్డెన్ చూపరులకు అందంగా ప్రశాంతతను ఇస్తోంది. అక్కడ కొంత భాగాన్ని అంబేద్కర్ విగ్రహం, పార్కు గా మంత్రి కేటీఆర్ మార్చేశారు. దానిపై ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతర పెట్టారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం ఎన్టీఆర్ ఘాట్ కు ఉన్న ప్రాంతాన్ని అంబేద్కర్ర స్మృతి వనం కింద మార్చడాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం అంటారా? ద్వేషం అంటారా? అనేది ఖమ్మం జిల్లాల పర్యటనలో చెబితే బాగుండేది.
Also Read : NTR statue in Khammam : మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే – KTR