BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వతేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల పోలీసు స్టేషన్ కు వచ్చిఅధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న దానిపై పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని వదిలిపెట్టవద్దని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో మరోసారి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించేందుకు ఈ నోటీసులు ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ఈ నెల 4వ తేదీన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై సైతం కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డి కలిసి తన ఫోన్ని ట్యాప్ చేస్తున్నారని.. వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 4వ తేదీన పాడి కౌశిక్ రెడ్డి పీఎస్కి వెళ్లారు.
ఈ క్రమంలోనే బంజారాహిల్స్ ఏసీపీకి ఉదయం ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారని.. తాను స్టేషన్కు వెళ్లేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారని.. సీఐ సైతం వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తే తనతో పార్టీ కార్యకర్తలు ప్రశ్నించానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారని.. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని .. పదవులు లేని సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.