Telangana New Tourism Policy: రానున్న అయిదేళ్లలో తెలంగాణ పర్యాటక రంగంలో భారీ పురోగతిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే, రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. అదనంగా, మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ కొత్త పర్యాటక విధానంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణ రావు ప్రసంగిస్తూ, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలను స్థాపించేందుకు మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు.
పర్యాటక రంగం అభివృద్ధి పట్ల ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉందని, కొత్త ప్రాజెక్టులతో దేశ, విదేశీ పర్యాటకులను తెలంగాణలోకి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ పర్యాటక రంగం దేశమంతా గమ్యస్థానం కానుందని మంత్రి జూపల్లి కృష్ణ రావు చెప్పారు.
పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించేందుకు మన ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని రూపొందించింది.
పర్యాటకంలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన, ప్రపంచస్థాయి సేవలు, ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో టూరిజం గమ్యస్థానంగా తెలంగాణను మార్చబోతున్నాము.… pic.twitter.com/epQhWZfNeQ
— Jupally Krishna Rao (@jupallyk_rao) December 17, 2024
రాష్ట్రంలో ‘సురక్షిత పర్యాటక వాతావరణం’ను సృష్టించేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలను ప్రకటించింది. పర్యాటకుల భద్రత, ముఖ్యంగా టూరిస్టు ప్రదేశాల్లో మహిళల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక టూరిస్ట్ పోలీసు యూనిట్లు, టూరిస్ట్ పెట్రోలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మహిళా పర్యాటకుల భద్రతపై ఏ మాత్రం రాజీ పడకుండా, టూరిజం ఫ్రెండ్లీ ఇండెక్స్ (TFI) ద్వారా భద్రతా ప్రమాణాలను పెంచాలని నిర్ణయించింది. అలాగే, అన్ని పర్యాటక ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ప్రతిపాదించారు.
దేశంలో రోజురోజుకూ పర్యాటక రంగం ప్రభావం పెరుగుతూ పోతోంది. దేశ జీడీపీలో పర్యాటక రంగ భాగస్వామ్యం 2023-24 నాటికి సుమారు 6.8 శాతంగా ఉంది.
పర్యాటక రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది. గత కొంత కాలంగా పర్యాటకం ప్రపంచవ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు… pic.twitter.com/gK92JzyPeC
— Jupally Krishna Rao (@jupallyk_rao) December 17, 2024
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో 1-2 గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గోదావరి, కృష్ణా నదుల పరిసరాల్లో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హౌజ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, వాటర్ కార్నివల్స్ నిర్వహించే ‘రివర్ ఫెస్టివల్స్’ను ప్రారంభించాలని భావిస్తున్నారు.
వారసత్వ కట్టడాలు, కోటలు, ప్యాలెస్లు, సమాధులు వంటి పర్యాటక ఆస్తుల పరిరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలను వాటిని దత్తత తీసుకోవాలని ప్రోత్సహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇక, రీజినల్ రింగు రోడ్డు ద్వారా డ్రై పోర్టుల అభివృద్ధితో పాటు, గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి మచిలీపట్నం పోర్టు వరకు అనుసంధానం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ఆధారంగా ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ల వద్ద లగ్జరీ బ్రాండెడ్ మాల్స్, ఫ్యాక్టరీ ఔట్లెట్స్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్త ఐకానిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, బౌద్ధ ప్రదేశాలు, టెంపుల్ టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
అన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతాల్లో హెలిప్యాడ్లను అభివృద్ధి చేయడం కూడా వారి ప్రణాళికలో భాగమని చెప్పారు. అలాగే, కొత్త టూరిజం పాలసీల అమలుకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా విస్మరించింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కనీస సోయి కూడా గత పాలకులకు లేకుండా పోయింది. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు కానీ బీఆర్ఎస్ నాయకుల ఆకాంక్షలు మాత్రం నెరవేరాయి.… pic.twitter.com/yVDCUOgbW0
— Jupally Krishna Rao (@jupallyk_rao) December 17, 2024