MLC By Election : నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. ఈరోజు నుంచి మే 9 వరకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్ను ఎన్నికల అధికారిగా ఈసీ (MLC By Election) నియమించింది. 10వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ బైపోల్ ఓటింగ్ జరుగుతుంది. జూన్ 5న రిజల్ట్ రిలీజ్ అవుతుంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ స్థానానికి గతంలో జరిగిన ఎమ్మెల్సీ పట్టభధ్రుల ఎన్నికలో పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నారు. 2021 సంవత్సరంలో కూడా ఇక్కడి నుంచి తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండటంతో విజయావకాశాలు పెరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తేలలేదు.
తీన్మార్ మల్లన్న యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామస్తుడు. ఈయన ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థి. జర్నలిజంలో మాస్టర్స్ చేసిన మల్లన్న.. వీ6 చానల్లో రిపోర్టర్ గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత క్యూ న్యూస్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లన్నకు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీజేపీ టికెట్ ను ముగ్గురు ఆశిస్తున్నారు. వారిలో ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానమైనప్పటికీ ఇంతవరకు క్యాండిడేట్ ఎవరనేది ఫైనల్ చేయలేదు. బీజేపీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.