Rythu Bharosa: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త వినిపించారు. రైతు భరోసా (Rythu Bharosa) పై అసెంబ్లీలో చర్చ జరిగింది. సాగు చేయని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి.. నిధులను దుర్వినియోగం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాగు చేసిన భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతికి విధివిధానాలు పూర్తి చేసి, నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది.
అసెంబ్లీ వేదికగా ప్రకటించిన తుమ్మల
అసెంబ్లీలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018-19లో గత ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది. ఎకరాకు నాలుగు వేల రూపాయలను రైతులకు ఇచ్చారు. 2019-20లో ఎకరాకు వెయ్యి రూపాయలు పెంచి ఐదు వేలు ఇచ్చారు. గత ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు బంధు ఇచ్చారు. ఎక్కువ భూమి ఉన్న రైతులకు చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. సభలో సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటాం. జనవరి నాటికి రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తాం. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం రైతు బంధు కోసం రూ. 80, 453 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు.
Also Read: CNG: మీరు కూడా సీఎన్జీ వాహనాలను నడుపుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
రైతు భరోసాకు కొత్త నిబంధనలు
తెలంగాణలో రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. రైతు భరోసా పొందాలంటే సదరు రైతు 5 ఎకరాలలోపు భూమిని కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ పొలం ఉన్నవారు రైతు భరోసాకు అనర్హులు. అయితే మన రాష్ట్రంలో 85- 90 శాతం మంది రైతులకు 5 ఎకరాల్లోపే పొలం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. పొలంతో పాటు అందులో ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూ ఉండాలి. రైతు భరోసా రావాలంటే రైతు వద్ద ఖచ్చితంగా పొలానికి సంబంధించిన పత్రాలు అన్ని ఉండాలి. పొలం వివరాలు, వాటికి సంబంధించిన పత్రాలను జిరాక్స్లతో రైతులు తమ దగ్గర ఉంచుకోవాలి.