Site icon HashtagU Telugu

Minister Ponguleti: బీఆర్ఎస్ చార్జ్ షీట్, తుగ్లక్ పాలన కామెంట్స్‌పై మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే!

Minister Ponguleti

Minister Ponguleti

Minister Ponguleti: పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం, ప్రతిపక్షాల ఫోన్లు టాప్ చేయించడం, డబ్బు మూటలు పట్టుకొచ్చిన వారిని తప్ప ఎవరినీ కలవకపోవడం, ప్రజలు నోరు తెరవకుండా ధర్నా చౌక్ లను ఎత్తేయడం, ఎమ్మేల్యేలను మంత్రులను కలవకపోవడం భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన స్వేచ్ఛను హరించి వేశారు. ప్రశ్నించిన ప్రతివాడికి పార్టీనుంచి పోలీసులనుంచి బెదిరింపులు చేసినవారిది, తుగ్లక్ పాలననా ? సచివాలయం నుండి ప్రజాపాలన నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వానిది తుగ్లక్ పాలననా ?
ఎర్రవెల్లిని రాజధానిగా చేసుకుని, ఫాంహౌస్ ను సెక్రటేరియట్ చేసుకుని ఎవరి మాటా వినకుండా ఒక రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు పాలించిన వారిది తుగ్లక్ పాలనా కాదా? మోడ్రన్ తుగ్లక్ మాత్రం ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ శతాబ్దానికి కేసీఆర్ ఒక్కడే అని మంత్రి పొంగులేటి విమ‌ర్శించారు. అలాగే ప‌లు విష‌యాల‌పై ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు.
తుగ్లక్ అంటే ఎవరో మన తరాలకు తెలియదా?
తుగ్లక్ అంటే ఇట్లా ఉంటాడని ఒక పెద్దాయన పదేళ్ళపాటు ప్రజలకు సినిమా వేసి మరీ చూపించారు. పదేండ్లు ప్రజల నెత్తిన టోపీ పెట్టిన అసలు సిసలు తుగ్లక్ మహారాజ్… కేసిఆర్… ఆ టైటిల్ కు ఇప్పుడే కాదు మరో 50 ఏండ్ల వరకు కూడా ఎవరూ పోటీకి రారు. చార్జ్ షీట్ పై స్పందిస్తూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై ఏడాది క్రితమే తెలంగాణ ప్రజానీకం వారికి డిస్ చార్జ్ షీట్ ఇచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావుకి ఇంకా జ్ఞానోదయం కాకపోవడం విచారకరం. వారి వాలకం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. పదెండ్ల పాలనలో వందేండ్లకు సరిపడా దోపిడీ చేసినవారే ఇవాళ చార్జ్ షీట్ అంటున్నారు.
రెవెన్యూలో ఏడాది ప్రగతి
ఈ ఏడాది కాలంలో రెవెన్యూ శాఖ‌కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి \నాయకత్వంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకొని రెవెన్యూ సేవ‌ల‌ను సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు చేపట్టాం. రెవెన్యూ విభాగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం.ఒక‌ వైపు ధ‌ర‌ణి పోర్టల్ ప్ర‌క్షాళ‌నకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డుతూనే  మ‌రోవైపు ధ‌ర‌ణికి సంబంధించి గ‌త ప్ర‌భుత్వంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకున్నాం. ఇంకోవైపు కొత్త రెవెన్యూ చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌కు శ్రీ‌కారం చుట్టి కొలిక్కి తీసుకువచ్చాం. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం.
అలాగే టెర్రాసిస్ అనే విదేశీ సంస్ద నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను త‌ప్పించి  కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన స్వ‌దేశీ  సంస్ధ  ఎన్ ఐ సి కి అప్ప‌గిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాం.
ధ‌రణితో అన్నీ స‌మ‌స్య‌లే
ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ  ప్రజలు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎన్నో సమస్యలు  ఎదుర్కొన్నారు.  త‌ర‌త‌రాలుగా త‌మ య‌జ‌మాన్యంలో ఉన్న  భూముల‌పై సర్వ హక్కులు కోల్పోయారు. భూముల వివ‌రాల‌ను ధ‌ర‌ణి పోర్ట‌ల్ లో న‌మోదు చేసే స‌మ‌యంలో జ‌రిగిన లోపాలు, అక్ర‌మాలు, అవ‌కత‌వ‌క‌ల వ‌ల్ల ల‌క్ష‌లాది మంది రైతులు తీవ్ర మనోవేద‌న‌కు గుర‌య్యారు.  రైతులు త‌మ‌ భూముల‌ను  అమ్ముకోవ‌డానికి గాని, ఆ భూముల‌పై బ్యాంకుల నుంచి రుణాలు పొంద‌డానికి గాని రైతుల ప‌డ్డ క‌ష్టాలు వ‌ర్ణ‌ణాతీతం.
కాంగ్రెస్‌ ప్రజా పాలనలో
ఈ ప‌రిస్థితుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన  వెంటనే సామాన్యుల‌కు  రెవెన్యూ సేవ‌లు అందేలా ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నాం. ముఖ్యంగా  ధరణి సమస్యలపై సమీక్షించి వాటి పరిష్కారానికి మార్గాలను చూపించేందుకు భూ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రీకృతమై ఉన్న అధికారాలను వికేంద్రీకరించి, మండల స్థాయిలో తహశీల్దార్‌కు, డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు సమస్యలను పరిష్కరించే అధికారాన్ని అప్పగించాం. ఒక్కప్పుడు ధరణీలో ఏ ఎంట్రీ మారినా ఎందుకు మారిందో తెలుసుకోవడానికి ధరణీ వెబ్‌సైట్‌లో కానీ, కాగితాల పైనా కానీ ఎలాంటి ఆధారం ఉండేది కాదు.
కానీ, ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి ధరఖాస్తు వచ్చినప్పటి నుండి సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతిదాన్ని కంప్యూటర్‌లో ఉంచి ఎవరైనా, ఎప్పుడైనా చూసుకునేలా చేశాం. అప్పటి ప్రభుత్వంలో ఏ కారణం చెప్పకుండానే ద‌రఖాస్తులను తిరస్కరించే వారు. కానీ ఇప్పుడు ద‌రఖాస్తు తిరస్కరించాల్సి వస్తే ధరఖాస్తు దారునికి తిరస్కరణకు గల కారణాలు వివరిస్తూ ప్రతి ధరఖాస్తుపై నివేదికను తప్పనిసరి చేశాం.
ధ‌ర‌ణి దర‌ఖాస్తుల ప‌రిష్కారం
ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వ‌ర‌కు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహించాం. కాంగ్రెస్  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చే నాటికి 2.46 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల్లో పెండింగ్ లో ఉండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1.38 లక్షల దరఖాస్తులను ప‌రిష్క‌రించడం జరిగింది.
ఈ ప్రభుత్వంలో ధ‌ర‌ణి స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌నే విశ్వాసం ప్ర‌జ‌ల‌లో ఏర్ప‌డ‌డంతో ద‌ర‌ఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. కొత్త‌గా 3.16 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు.  ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన మొత్తం 5.62 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌లో 4.68 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌ను పరిష్కరించడం జరిగింది. అంటే దాదాపు 83% దరఖాస్తులను పరిష్కరించి రైతాంగానికి ఈ ప్రభుత్వం అండగా నిలించింది. గత ప్రభుత్వంలో సంవత్సరాలు గడిచినా దరఖాస్తులకు మోక్షం లభించేది కాదు. ఇప్పుడు నెల వ్య‌వ‌ధిలోనే పరిష్కారం లభిస్తుంది.
ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణ బాధ్య‌త విదేశీ సంస్ధ నుంచి స్వ‌దేశీ సంస్ద‌
అధికారంలోకి రాగానే ధ‌ర‌ణి బాధ్య‌త‌ల‌ను  ప్ర‌భుత్వ సంస్థల‌కు అప్ప‌గిస్తామ‌ని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నాం. గ‌త ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌ను 2020 న‌వంబ‌ర్ నుంచి టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు అప్ప‌గించింది. ఫ‌లితంగా 1 కోటి 56 ల‌క్ష‌ల ఎక‌రాల  తెలంగాణ  భూముల‌ వివ‌రాలు ఆ విదేశీ సంస్ధ చేతిలోకి వెళ్లాయి. ఈ భూముల నిర్వ‌హ‌ణ లోప‌భూయిష్టంగా ఉండ‌డంతో రైతులు భూ స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు.  ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణ  బాధ్య‌త‌ను టెర్రాసిస్ సంస్థ నుంచి తొల‌గించి గ‌తం కంటే ఏడాదికి రూ. 85 ల‌క్ష‌లు త‌క్కువ ధ‌ర‌కు కు నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మాటిక్ సెంటర్ (ఎన్‌.ఐ.సి)కి డిసెంబర్ 1వ తేది నుంచి అప్ప‌గించడం జరిగింది.
గ్రామాల‌లో రెవెన్యూ సేవ‌లు పునరుద్ధరణకు చర్యలు
గ‌త ప్ర‌భుత్వం  విఆర్‌వో, విఆర్ఎ వ్య‌వ‌స్ధ‌ను ర‌ద్దుచేసి గ్రామీణ ప్రాంతాల‌లో సామాన్యుల‌కు రెవెన్యూ సేవ‌ల‌ను దూరం చేసింది. గ్రామీణ ప్రాంతాల‌లో రెవెన్యూ వ్య‌వ‌స్థను ప‌టిష్‌‌ప‌ర‌చ‌డానికి గ్రామాల‌లో రెవెన్యూ సేవ‌లు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల‌లో రెవెన్యూ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఒక రెవెన్యూ ఉద్యోగిని నియ‌మించ‌డానికి  కార్యాచరణను రూపొందించాం.
సిద్ధ‌మైన కొత్త చ‌ట్టం
రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా నూత‌న రెవెన్యూ చ‌ట్టం -2024ను వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టేందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేశాం. అంత‌కుముందు ఆగ‌స్టు నెల‌లో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌లో ముసాయిదా చ‌ట్టాన్ని అసెంబ్లీలో ప్‌లవేశ‌పెట్టి విస్తృతంగా చర్చించాం. అదేరోజు సి‌సి‌ఎల్‌ఏ వెబ్ సైట్ లో కూడా ముసాయిదా చట్టాన్ని పెట్టడం జరిగింది.
రైతు సంఘాలు, మేధావులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో సాధార‌ణ ప్ర‌జానీకం మ‌రియు రిటైర్డ్ అధికారుల నుంచి స్వీకరించిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో కొత్త చ‌ట్టాన్ని త‌యారు చేశాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన సూచనలు కూడా పరిగణనలోకి  తీసుకోవడం జరిగింది.
అలాగే రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కూడా నిర్వహించడం జరిగింది. పద్దెనిమిది రాష్ట్రాలలో అధ్యయనం చేసి అక్కడ అమలు అవుతున్న మంచి అంశాలను ఈ చట్టంలో పొందు పరచడం జరిగింది. తరతరాల భూ సమస్యలకు ముగింపు పలికేలా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా, దేశానికే ఆదర్శంగా ఉండేలా ఒక రోల్ మోడల్ గా 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు రాబోతున్నాం.
ఇందిరమ్మ ఇండ్లు 
ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, ఏ తండాకు పోయినా, ఏమారుమూల ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్ళే కనబడతాయి. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు. మేం గర్వంగా చెబుతున్నాం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని చెబుతున్నాం.
Also Read: Minister Sridhar Babu: అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీధర్ బాబు
ఎన్నికల హామీకి కార్యరూపం
ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేర‌కు వచ్చే నాలుగు సంవ‌త్స‌రాల‌లో ద‌శ‌ల వారీగా సుమారు 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. మొద‌టి విడ‌త‌లో భాగంగా ఈ ఏడాది నియోజ‌క‌వ‌ర్గానికి 3500 నుంచి 4000 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. మొద‌టి విడ‌త‌లో నివాస స్ధ‌లం ఉన్న‌వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని, రెండో ద‌శ‌లో ప్ర‌భుత్వ‌మే నివాస స్ధ‌లంతో పాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మాచారులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు 
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌గ‌ది, టాయిలెట్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంటాయి.
గ‌త ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్య‌వ‌స్ధ ఉండేది. ఇప్పుడు ఆవ్య‌వ‌స్ధ‌ను ర‌ద్దు చేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నాం. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చ‌ద‌ర‌పు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు.
హౌసింగ్ శాఖ పున‌రుద్ద‌ర‌ణ‌
పేద‌ల‌కు ఇండ్లు నిర్మించే హౌసింగ్ శాఖ‌ను గ‌త ప్ర‌భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగుల‌ను ఇత‌ర శాఖ‌ల‌లో విలీనం చేసింది. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖ‌ను పునరుద్ధ‌రించి ల‌బ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం, ప‌ర్య‌వేక్ష‌ణ వ‌ర‌కు అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని స‌మ‌కూర్చుకుంది. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామ‌న్నారు.