Metro To Airport : హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచైనా మెట్రోలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.200లోపు ఖర్చుతో మనం చేరుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ దిశగా మెట్రో కారిడార్లను నిర్మించే దిశగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం మరో కీలక నిర్ణయం తీసు కున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జేబీఎ్స-ఎంజీబీఎస్ రూట్లలో మూడు మెట్రో ట్రైన్ కారిడార్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేలా 29 కి.మీ. మేర మరో మెట్రోలైన్ను నిర్మించనున్నారు. దీన్ని మూడు మెట్రో ట్రైన్ కారిడార్లతో కనెక్ట్ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే మొదటిదశలో నిర్మించిన ఏ మెట్రో స్టేషన్లో రైలెక్కినా నేరుగా ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికీ ఎయిర్పోర్టు ప్రయాణం సమయం, ఖర్చును ఆదా చేసేలా రెండో దశ మెట్రో ట్రైన్ నిర్మాణ ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఉదాహరణకు విజయవాడ, నల్లగొండ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎల్బీనగర్లో ఎయిర్పోర్టు మెట్రో ఎక్కొచ్చు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వైపు నుంచి వచ్చేవారు నేరుగా జేబీఎస్ మెట్రో ఎక్కి ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు. ఈ రూట్లలో ఎక్కడి నుంచైనా ఎయిర్ పోర్టుకు ఛార్జీ రూ.200కు మించకుండా చూడాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్పోర్టు రూట్ను సీఎం రేవంత్ రద్దు చేశారు. ఐటీ కారిడార్ పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణకు భారీగా ఖర్చవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతోపాటు రాయదుర్గం ఏరియా ప్రజలు ఎక్కువగా సొంత వాహనాల్లోనే ఔటర్ మీదుగా ఎయిర్పోర్టుకు వెళ్తుంటారు. దాంతో మెట్రోకు పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చని రేవంత్ సర్కారు భావించింది. దానికి బదులుగా నాగోల్ – చాంద్రాయణగుట్ట – శంషాబాద్ ఎయిర్పోర్టు రూట్ను సీఎం రేవంత్ ఎంపిక చేశారు. ఓల్డ్సిటీ వంటి ప్రాంతాల నుంచి కూడా నిత్యం విదేశాలకు వెళ్తుంటారని, అలాంటి వారికి కొత్త కారిడార్ ఉపయుక్తంగా ఉంటుందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది.
రెండో దశలో మొత్తం ఆరు కారిడార్లలో 70 కి.మీ. మేర మెట్రోలైన్ పనులను ప్రతిపాదించారు. మొదటి దశలో పూర్తయిన జేబీఎస్ -ఎంజీబీఎస్ లైన్కు మిగిలిన పనిని పూర్తి చేస్తారు. ఫలక్నుమా వరకు 5.5కి.మీ మెట్రో రూట్ను నిర్మిస్తారు. ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 1.5 కి.మీ రూట్ను రెండో దశలో కొత్తగా చేర్చారు. ఈ లైన్ పూర్తయితే ప్రయాణికులు జేబీఎస్ – చాంద్రాయణగుట్ట కారిడార్లో ఏ స్టేషన్లో మెట్రో ఎక్కినా ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు. ఇందుకోసం చాంద్రాయణగుట్ట స్టేషన్ను అమీర్పేట్ రెడ్లైన్ స్టేషన్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు.