Maoist Party : గిరిజన రైతుకూలీ సంఘం మహాసభ సందర్భంగా 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన ఘటనను స్మరించుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ మంగళవారం లేఖ విడుదల చేశారు. 43 ఏళ్ల మహత్తర ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సవంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. ‘‘ఇంద్రవెల్లి పోరాటంలో గోండులు అమరులైన స్థలంలో 1982లో గిరిజన రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో 120 అడుగుల స్థూపాన్ని నిర్మించారు. అయితే ఆనాటి ప్రభుత్వం స్థూపాన్ని 1986లో పోలీసులతో కూల్చివేయించింది. తద్వారా ఇంద్రవెల్లి పోరాట జ్వాలను ఆర్పివేయాలని చూసింది’’ అని జగన్(Maoist Party) పేర్కొన్నారు.
ఆదివాసుల నుంచి వెల్లువెత్తిన నిరసనలతో ఎన్టీఆర్ ప్రభుత్వం మళ్లీ స్థూపాన్ని నిర్మించి సైనిక బలగాలు, పోలీసులతో ఆ ప్రాంతాన్ని దిగ్బందించి 144 సెక్షన్ విధించి స్థూపం వద్దకు ఎవరిని రానియకుండా నిషేధాజ్ఞలు విధించిందని ఆయన లేఖలో విమర్శించారు. అయినా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న ఆదివాసులు నిషేదాజ్ఞలను ధిక్కరిస్తూ పోలీసుల దిగ్భందాన్ని చేదించుకొని స్థూపం వద్దకు చేరుకొని జెండాలు ఎగుర వేసి ఇంద్రవెల్లి అమరులను స్మరించుకుంటున్నారని జగన్ తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సామ్రాజ్యవాద, బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు, భూస్వామ్య నిరంకుశ దళారీ బూర్జువాలకు తలవొగ్గి పనిచేస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ఒకే దేశం-ఒకే మతం-ఒకే భాష విధానాలతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలపోరాటాల చరిత్రను వక్రీకరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఆదివాసుల హక్కు జల్ జంగల్-జమీన్-ఇజ్జత్ అధికారం దక్కేంత వరకు ఉద్యమజ్వాల నిరంతరం దేదీప్యమానంగా జ్వలిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంద్రవెల్లి అమరుల పోరాట స్ఫూర్తితో ఆదివాసులు, ఆదివాసేతరులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాసంఘాలు ఏకమై ఉద్యమం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.