Manikkam Tagore Vs KTR : ‘రూ.50 కోట్ల అంశం’పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వార్ నడుస్తోంది. ‘‘మాణిక్కం ఠాగూర్కు రూ.50 కోట్ల ముడుపులు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి దక్కించుకున్నారు’’ అని గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలపై మాణిక్కం ఠాగూర్ న్యాయపోరును మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పరువునష్టం దావా నోటీసులను కేటీఆర్కు ఆయన పంపారు. ఇవే నోటీసులను ట్విట్టర్లోనూ మాణిక్కం ఠాగూర్ పోస్ట్ చేశారు. వాటిని రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి సంబంధించిన రూ.50 కోట్ల డీల్పై తొలుత బహిరంగంగా మాట్లాడింది తాను కాదని.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని కేటీఆర్ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. మాణిక్కం ఠాగూర్ ఈ విషయాన్ని గ్రహించి.. పరువు నష్టం నోటీసులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్రస్కు డైవర్ట్ చేయాలని మాణిక్కం ఠాగూర్ను కోరారు.
Manickam Garu,
Why are you in a confused mode and misdirecting these notices?
It was your colleague congressman & MP Venkat Reddy who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for ₹50 Crore
I had merely quoted the same since it was… https://t.co/YtK6EY9EIj pic.twitter.com/gickKF8Euy
— KTR (@KTRBRS) January 31, 2024
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న సెక్రటేరియట్లోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూర్చొని ఉన్నారని కేటీఆర్ తన పోస్టులో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కొందరు కీలకమైన పదవులను అమ్ముకుంటున్నారంటూ 2021 జూన్ 28న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘సాక్షి పోస్ట్’లో ప్రచురితమైన ఒక న్యూస్ క్లిప్ను తన ట్విట్టర్ పోస్టులో కేటీఆర్ జోడించారు. ‘‘మీపై చేసిన ఆరోపణలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు. వాటిపై వివరణ కూడా ఇవ్వలేదు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి’’ అని కేటీఆర్ ఆసక్తికర కామెంట్ చేశారు.
మరోవైపు కేటీఆర్కు పంపిన పరువు నష్టం నోటీసులలో మాణిక్కం ఠాగూర్ సైతం కీలకమైన వివరాలను ప్రస్తావించారు.‘‘ఒకవేళ నా నోటీసులు అందిన వారం రోజుల్లోగా కేటీఆర్ బేషరతు క్షమాపణ చెప్పకుంటే మధురై హైకోర్టు బెంచ్ను ఆశ్రయిస్తాను’’ అని స్పష్టం చేశారు. ఈ నెల 28న సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్లపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. ‘‘నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు.. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో, మేనేజ్ చేసుకుని.. మాణిక్కం ఠాగూర్కు రూ.50 కోట్లిచ్చి, మళ్లీ ఢిల్లీకి వెళ్లి మేనేజ్ చేసుకుని తెచ్చుకున్న పదవి తప్పా.. ప్రజలంతా కూడబలుక్కొని ఎన్నుకోలేదు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలిగోటికి సరిపోవు’’ అని ఆ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు.